ఏపీ సీఎం , వైసీపీ అధినేత వైఎస్ జగన్పై మరోసారి సెటైర్లు వేశారు ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు. ఉద్యోగులకు, ప్రజలకు పార్టీని దూరం చేయొద్దన్న ఆయన మనకు సాక్షి వుందని.. మనస్సాక్సి మాత్రం లేదని ఎద్దేవా చేశారు.
ఏపీ సీఎం , వైసీపీ అధినేత వైఎస్ జగన్పై మరోసారి విరుచుకుపడ్డారు ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేశారని, ఆయనకు రుణరత్న అవార్డు ఇవ్వాలంటూ సెటైర్లు వేశారు. కుప్పంలో పేదవాడికి అన్నం పెట్టే క్యాంటీన్ను ధ్వంసం చేయడం దుర్మార్గమని, మనం ఒకరికి పెట్టం, ఇతరులను పెట్టనివ్వమంటూ సీఎం పై రఘురామ చురకలు వేశారు. ఉద్యోగులపై మన ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని.. వారి పట్ల కఠినంగా వ్యవహరించరాదని ఎంపీ హితవు పలికారు. ఉద్యోగులకు, ప్రజలకు పార్టీని దూరం చేయొద్దని రఘురామ సూచించారు. మనకు సాక్షి వుందని.. మనస్సాక్సి మాత్రం లేదని ఆయన ఎద్దేవా చేశారు.
ఇకపోతే.. వచ్చే ఏపీ ఎన్నికలకు సంబంధించి రఘురామ కృష్ణంరాజు సర్వే నిర్వహించి ఫలితాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే ‘వార్ వన్ సైడే’ అని ఆయన పేర్కొన్నారు. విస్తృతస్థాయి శాంపిల్స్ తో శాస్త్రీయంగా తాను జూన్, జూలై మొదటివారం వరకు సర్వే నిర్వహించానని ఆయన తెలిపారు. ఈ సర్వేలో తెలుగుదేశం పార్టీ 93 స్థానాల్లో కచ్చితంగా విజయం సాధిస్తుందని తేలిందని అన్నారు. ఇక నువ్వా నేనా అన్నట్టు ఉన్న వాటిలో సగం స్థానాల్లో గెలిచినా.. ఆ పార్టీకి 127 స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.
Also REad:ఈ సారి ఎన్నికల్లో ‘వార్ వన్ సైడే’.. టీడీపీదే అధికారం.. రఘురామ కృష్ణంరాజు సర్వే..
ఈ మేరకు ఢిల్లీలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైసిపి కచ్చితంగా గెలిచే స్థానాలు 7 నుంచి 8 ఉన్నాయని, మరో మూడు నుంచి నాలుగు స్థానాల్లో విజయావకాశాలు మెరుగ్గా ఉన్నాయని అన్నారు. ఇంగ్లీషు ఛానెల్స్ సర్వేలను చూసి తమ పార్టీ నాయకులు మురిసిపోతూ కూర్చుంటే.. పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల్లో సర్వే ఫలితాలను ఆయన చదివి వినిపించారు.