
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో సీబీఐ దూకుడు పెంచిన నేపథ్యంలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా బాబాయ్ హత్య, కోడికత్తి అంటూ అబద్ధాలు చెప్పి తమ పార్టీ గత ఎన్నికల్లో గెలిచిందన్నారు. 100 మంది సలహాదారులను పెట్టుకున్న జగన్.. రాష్ట్ర భవిష్యత్తు కోసం, అభివృద్ధి కోసం సొంతంగా ఏమైనా సలహాలు ఇవ్వగలరా అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా, పోలవరం అంటూ ఇంకెన్ని రోజులు కాలం గడుపుతారని రఘురామ ప్రశ్నించారు.
అంతకుముందు వివేకా కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని బుధవారం ఐదు గంటల పాటు సీబీఐ అధికారులు విచారించారు. వైఎస్ అవినాష్ రెడ్డి ఇచ్చిన సమాచారం ఆధారంగా వైఎస్ భాస్కర్ రెడ్డి , ఉదయ్ కుమార్ రెడ్డిలను సీబీఐ విచారించింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో రూ. 40 కోట్లు డీల్ ఉందని దస్తగిరి వాంగ్మూలం ఇచ్చారు. ఈ డీల్ గురించి సీబీఐ అధికారులు ప్రశ్నించారని సమాచారం. మరోవైపు సునీల్ యాదవ్ కు కోటి రూపాయాలు ఎవరు బదిలీ చేశారనే విషయమై సీబీఐ ప్రశ్నించింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అరెస్టైన వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను సీబీఐ కస్టడీకి కోర్టు ఇచ్చింది. ఆరు రోజుల పాటు కస్టడీకి ఇస్తూ కోర్టు నిన్న ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇవాళ ఈ ఇద్దరిని కూడా సీబీఐ అధికారులు విచారించారు.
Also Read: సొంత పిన్నమ్మ తాళి తెంపింది జగన్ రెడ్డే..: వివేకా హత్యపై టిడిపి ఎమ్మెల్సీ సంచలనం
ఈ క్రమంలో వైఎస్ అవినాష రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను వేర్వేరుగా సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఆ తర్వాత ఈ ముగ్గురిని సుమారు గంటన్నరపాటు కలిపి ప్రశ్నించారు. విచారణ ప్రక్రియను సీబీఐ రికార్డు చేసింది. ఆడియో, వీడియోను రికార్డు చేయాలని కోర్టు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. విచారణ అనంతరం సీబీఐ కార్యాలయం నుండి వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను సీబీఐ అధికారులు చంచల్ గూడ జైలుకు తరలించారు.