ఆడపిల్లలపై కాలు దువ్వే స్థాయికి దిగజారలేదు..: అఖిలప్రియ కామెంట్స్‌కు శిల్పా రవిచంద్రారెడ్డి కౌంటర్

By Sumanth KanukulaFirst Published Feb 3, 2023, 5:37 PM IST
Highlights

టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ చేసిన కామెంట్స్‌కు వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రారెడ్డి కౌంటర్ ఇచ్చారు. తన బాస్ జగన్‌ అని.. తాను వైసీపీని వీడే ప్రసక్తే లేదని చెప్పారు.

టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ చేసిన కామెంట్స్‌కు వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రారెడ్డి కౌంటర్ ఇచ్చారు. తన బాస్ జగన్‌ అని.. తాను వైసీపీని వీడే ప్రసక్తే లేదని చెప్పారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి వివాదాన్ని అవకాశంగా తీసుకుని తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అఖిలప్రియ చేస్తున్న ఆరోపణల్లో చంద్రబాబు మార్క్ ట్రిక్స్ ఉన్నాయని విమర్శించారు. అఖిలప్రియ వైసీపీలో కలకలం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఆడపిల్లలపై కాలు దువ్వే స్థాయికి తాను దిగజారలేదని అన్నారు. తాను టీడీపీలో చేరాలని అనుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ఆ మాట జగన్‌ను లోకేష్ ఎమ్మెల్సీ పదవి అడిగినట్లు ఉందని అన్నారు. 

ఇదిలా ఉంటే.. టీడీపీ నాయకురాలు భూమా అఖిల ప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు. నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రారెడ్డి టీడీపీ నేతలతో టచ్‌లో ఉన్నారని తనకు తెలిసిందని వివరించారు. అంతేకాదు ఆయన పార్టీ మారే ఆలోచనలు చేస్తున్నట్టు తెలిసిందని పేర్కొన్నారు. ఆయన చూపు టీడీపీ వైపు ఉందని అన్నారు. టీడీపీలో చేరడానికి రవిచంద్రారెడ్డి వేదిక సిద్ధం చేసుకుంటున్నారని చెప్పుకొచ్చారు. 

అలాగే శిల్పా రవిచంద్రారెడ్డికి మరోసారి సవాల్ విసిరారు. ఈ నెల 4వ తేదీన నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రారెడ్డి అక్రమాలను ఆధారాలతో సహా బయటపెడతానని అన్నారు. అదే విధంగా తనపై వారు ఆరోపణలు చేసినట్టుగా తన అక్రమాలేమిటో కూడా బయటపెట్టాలని చాలెంజ్ చేశారు. ఈనెల 4వ తేదీన నంద్యాలలోని గాంధీ చౌక్ వద్దకు ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రారెడ్డి అక్రమాల చిట్టాను తాను తీసుకు వస్తానని అన్నారు. తాను అక్రమాలకు పాల్పడినట్టు శిల్పా రవిచంద్రారెడ్డి చేసిన ఆరోపణలను ఆధారాలతో సహా నిరూపించాలని లేదంటే.. బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

click me!