రాజమౌళీ, బోయపాటిలు సలహాదారులా.. ఏంటి బాబూ ఇది: ధర్మాన

By sivanagaprasad KodatiFirst Published Dec 17, 2019, 2:32 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంగళవారం అమరావతిపై వాడి వేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. రాజమౌళీ, బోయపాటి లాంటి సినిమా డైరెక్టర్లు చంద్రబాబుకు రాజధాని విషయంలో సలహాదారులా అని ధర్మాన దుయ్యబట్టారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో మంగళవారం అమరావతిపై వాడి వేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. రాజమౌళీ, బోయపాటి లాంటి సినిమా డైరెక్టర్లు చంద్రబాబుకు రాజధాని విషయంలో సలహాదారులా అని దుయ్యబట్టారు. రాజధానిలో ఏ ఆఫీసు ఎక్కడ ఉందో తెలియని గందరగోళ పరిస్ధితి నెలకొందన్నారు.

ఇప్పటి వరకు రాష్ట్రానికి సరైన రాజధాని లేకుండా పోయిందని అంటూ టీడీపీ ప్రభుత్వం శివరామకృష్ణన్ కమిటీ నివేదికను ఎందుకు అమలు చేయలేదని ధర్మాన ప్రశ్నించారు. తమ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేశారనే భావనతో పార్టీలతో సంబంధం లేకుండా నాడు తెలంగాణ ఉద్యమం జరిగిందని ప్రసాదరావు గుర్తుచేశారు.

Also Read:మాజీమంత్రి అచ్చెన్నాయుడుపై వైసీపీ ప్రివిలేజ్ మోషన్

ఒక ప్రాంతాన్ని మాత్రమే అభివృద్ధి చేసినందుకు మోసం జరిగిందని... తెలంగాణ ఉద్యమం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఇదేనని ఆయన గుర్తుచేశారు. ఏపీలో మళ్లీ అదే మోసం జరిగిందన్నారు. పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ను వదిలి వచ్చేశారని అన్ని వర్గాల్లోనూ ఆవేదన వుందని ధర్మాన వ్యాఖ్యానించారు.

ఒక ప్రాంతాన్ని మాత్రమే అభివృద్ధి చేస్తే భవిష్యత్తులో మరో ఉద్యమం వస్తుందని ధర్మాన హెచ్చరించారు. వెనుకబడిన శ్రీకాకుళం, రాయలసీమ ప్రాంతాలను టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని ప్రసాదరావు విమర్శించారు.

ఈ రెండు ప్రాంతాలకు ఒక్క పెద్ద ప్రాజెక్ట్‌నైనా ఇచ్చారా అని ధర్మాన ప్రశ్నించారు. ఏ ఒక్క సంస్థ పెట్టడానికి శ్రీకాకుళానికి అర్హత లేదా..? వేలకు వేల ఎకరాలు తీసుకుని రైతుల నోట్లో మట్టికొట్టారని ఆయన ఎద్దేవా చేశారు.

ప్రాక్టికల్‌గా సాధ్యంకాని అంశాలను నమ్మించే ప్రయత్నం చేశారని.. కేవలం ఒక్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఏం సాధిస్తారని ప్రసాదరావు నిలదీశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే ప్లాన్ నడుస్తోందని తాను గతంలోనే చెప్పిన సంగతిని ధర్మాన ఈ సందర్భంగా గుర్తుచేశారు. 

మన చుట్టూ వున్న వాళ్లని బట్టే మన ఆలోచనలు ఆధారపడి వుంటాయని మరి చంద్రబాబు చుట్టూ ఎవరున్నారో ఆయనకే తెలియని ధర్మాన చురకలంటించారు. హైదరాబాద్ నగరం కళకళలాడేందుకు 400 ఏళ్లనాడే నాటి నవాబు అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారని ప్రసాదరావు గుర్తుచేశారు. పరిపాలన ఒక్క చోట కేంద్రీకృతం చేయొద్దని.. అన్ని ప్రాంతాల్లోనూ సంస్థలు ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. 

రాజధానిని ప్రకటించడానికి ముందే బంధువులు, సొంత పార్టీ నేతలకు చంద్రబాబు ముందే లీకులు ఇచ్చి వేలాది ఎకరాలు కొనేలా చేశారని ప్రసాదరావు ఆరోపించారు. తమ ప్రభుత్వం అసైన్డ్ భూములను పేదలు, దళితులకు ఇవ్వాలని నిర్ణయించిందని ఆయన గుర్తుచేశారు.

Also Read:ఆ ఎమ్మెల్యే నా నియోజకవర్గాన్ని పూర్తిగా నాకేశాడు: రాపాక సంచలన వ్యాఖ్యలు

చంద్రబాబు అనుకున్న రాజధాని ఎన్ని దశాబ్ధాలయితే పూర్తవుతుందని ధర్మాన ప్రశ్నించారు. రాజధాని పేరుతో అప్పటి ముఖ్యమంత్రి టీవీల్లో గ్రాఫిక్స్ చూపించి.. రైతుల భూముల్లో కంచెలు పెట్టించారని ధర్మాన మండిపడ్డారు. ఎవరిష్టం వచ్చినట్లు వాళ్లు రాజధానిని దోచుకున్నారని ఆయన ఆరోపించారు. 

click me!