
ఏపీ సీఎం వైఎస్ జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డిని తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా సీబీఐ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలను ప్రస్తావించింది సీబీఐ. తప్పనిసరి పరిస్థితుల్లోనే తాము భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసినట్లు తెలిపింది. అరెస్ట్ చేయకుంటే ఆయన అందుబాటులో వుండటం లేదని పేర్కొంది. 10 రోజులు కస్టడీకి ఇస్తే మరిన్ని విషయాలను రాబడతామని న్యాయస్థానాన్ని సీబీఐ కోరింది. గతంలో సీబీఐ విచారణకు హాజరైనా ఆయన సహకరించలేదని పేర్కొంది. వైఎస్ భాస్కర్ రెడ్డి సాక్షులను ప్రభావితం చేయగల వ్యక్తని సీబీఐ అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పిటిషన్ను స్వీకరించిన సీబీఐ న్యాయస్థానం రేపు వాదనలను వింటామని తెలిపింది.
అంతకుముందు వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి సీబీఐ కోర్ట్ 14 రోజుల జ్యుడిషీయల్ రిమాండ్ విధించింది. దీంతో ఆయనను పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించనున్నారు. వివేకా కేసులో ఉదయం పులివెందులలో భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు.. హైదరాబాద్కు తరలించారు. అనంతరం ఆయనను సీబీఐ జడ్జ్ ఎదుట హాజరుపరచగా.. భాస్కర్ రెడ్డికి న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు.
Also Read: ధైర్యంగా ఎదుర్కొంటాం: భాస్కర్ రెడ్డి అరెస్ట్ పై సీబీఐ, సునీతలపై అవినాష్ రెడ్డి ఫైర్
కాగా.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసిపి ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని ఆదివారం సిబిఐ అదుపులోకి తీసుకుంది. ఇప్పటికే వివేకా హత్య కేసు విచారణను వేగవంతం చేసిన సిబిఐ అరెస్టులను ప్రారంభించడం అవినాష్, భాస్కర్ రెడ్డి అరెస్ట్ ఖాయమంటూ ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే వైఎస్సార్ కడప జిల్లా పులివెందులోని వైసిపి ఎంపి అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ఇళ్లకు సిబిఐ అధికారులు చేరుకోవడంతో అలజడి మొదలయ్యింది. అవినాష్ రెడ్డి ముఖ్య అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డి అరెస్ట్ తర్వాత జరుగుతున్న పరిణామాలు కలకలం రేపుతుండగా తాజాగా సిబిఐ అధికారులు అవినాష్ ఇంటికి చేరుకోవడంతో ఏదో జరగబోతోందని అందరూ భావించారు. చివరకు అవినాష్ తండ్రి భాస్కర్ రెడ్డిని సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
కుటుంబంతో వ్యక్తిగతంగానే కాదు రాజకీయంగా విబేధాల నేపథ్యంలో సొంత బాబాయ్ వివేక్ ను అవినాష్ రెడ్డి హత్య చేయించాడని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో సానుభూతి కోసం ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ కూడా వివేకా హత్యకు సహకరించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇలా అధికార పార్టీకి చెందిన కీలక నాయకుల ప్రమేయం వున్నట్లు అనుమానాల నేపథ్యంలో వివేకా కూతురు సిబిఐ విచారణను కోరారు. దీంతో ఏపీ పోలీసుల చేతినుండి ఈ కేసు సిబిఐ చేతికి వెళ్లడంతో ఏపీలో అలజడి మొదలయ్యింది.