year roundup 2019: జగన్‌కు జై కొట్టిన ఏపీ, ఎదురీదుతున్న బాబు

By narsimha lodeFirst Published Dec 22, 2019, 12:07 PM IST
Highlights

ఈ ఏడాది వైఎస్ జగన్‌కు కలిసి వచ్చింది. చంద్రబాబుకు ఈ ఏడాది కలిసి రాలేదు. 

అమరావతి: ఈ ఏడాది వైసీపీ చీఫ్ జగన్ కు కలిసొచ్చింది. ఏపీ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. 151 ఎమ్మెల్యే సీట్లతో జగన్ ముఖ్యమంత్రి పదవిని దక్కించుకొన్నారు.23 సీట్లతో చంద్రబాబునాయుడు ప్రతిపక్షానికి మాత్రమే పరిమితమయ్యారు. టీడీపీ ఘోరంగా ఈ ఎన్నికల్లో దెబ్బతింది. 

also read: Year roundup 2019:తెలంగాణలో కమలానికి కలిసొచ్చిన కాలం

అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2014 నుండి 2019 వరకు ఆయన ఈ పదవిలో ఉన్నారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం చంద్రబాబు ప్రయత్నించారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టులు పూర్తి కాలేదు. ఈ లోపుగా ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో చంద్రబాబునాయుడు అధికారాన్ని కోల్పోయాడు.

2014లో జరిగిన ఎన్నికల్లో ఏపీలో వైఎస్ఆర్‌సీపీ అధికారానికి దూరమైంది. అయితే ఎన్నికలకు ఏడాదిన్నర ముందే వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ఏపీ రాష్ట్రంలో పాదయాత్రను ప్రారంభించారు. పాదయాత్రకు ముందుగా జగన్ తాము అధికారంలోకి వస్తే ఏపీ రాష్ట్రంలో ఏ కార్యక్రమాలను చేపడుతామనే విషయాన్ని నవరత్నాలను అమలు చేస్తామని హామీ ఇచ్చాడు.

Also read:Year roundup 2019:ప్రతిపక్షాలకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన కేసీఆర్

నవరత్నాల గురించి పాదయాత్రలో విస్తృతంగా ప్రచారం నిర్వహించాడు వైఎస్ జగన్. అయితే ఎన్నికలకు ఏడాది ముందే ఏపీకి ప్రత్యేక హోదా విషయమై బీజేపీతో టీడీపీ నేతలు విభేదించారు.  ఎన్డీఏ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టారు. ఎన్డీఏ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టడానికి ముందే ఎన్డీఏ నుండి కూడ టీడీపీ వైదొలిగింది.

also read:Weekly roundup:దిశ నిందితుల మృతదేహాలు గాంధీలోనే, మరో పోరాటానికి పసుపు రైతులు

ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో  టీడీపీ ఒంటరిగా పోటీ చేసింది. ఒక్కసారి తనకు అవకాశం ఇవ్వాలని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ప్రజలను కోరారు.అంతేకాదు చంద్రబాబునాయుడు సర్కార్  అవినీతికి పాల్పడిందని వైసీపీ చేసిన ప్రచారం ఆ పార్టీకి కలిసి వచ్చింది. 

టీడీపీకి చెందిన స్థానిక ప్రజా ప్రతినిధులపై తీవ్ర వ్యతిరేకత ఉంది. వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేల, ఎంపీ అభ్యర్థులను మార్చలేదు. తిరిగి వారిని బరిలోకి దింపింది టీడీపీ.  ఎన్నికల ముందు తెలంగాణ సీఎం కేసీఆర్‌తో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ కుమ్మక్కయ్యారని చంద్రబాబునాయుడు ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రచారం చేశారు. 

Also read:జగన్ మూడు రాజదానులు: పవన్ కల్యాణ్, నాగబాబులకు చిరంజీవి షాక్

తెలంగాణ ఎన్నికల సమయంలో కేసీఆర్ చంద్రబాబును చూపి సెంటిమెంట్ ను రగిల్చారు. ఈ ప్రచారం తెలంగాణలో టీఆర్ఎస్‌కు కలిసొచ్చింది. అదే రకమైన ప్రచారాన్ని చంద్రబాబునాయుడు ఏపీలో చేశారు. కానీ, ఏపీలో మాత్రం టీడీపీకి ఈ ప్రచారం పెద్దగా ఫలితం ఇవ్వలేదు. టీడీపీ 23 అసెంబ్లీ, మూడు ఎంపీ స్థానాలకు మాత్రమే పరిమితమైంది. 

బీజేపీకి ఒక్క స్థానం కూడ దక్కలేదు. జనసేనకు ఒక్క ఎమ్మెల్యే స్థానం దక్కింది. టీడీపీ ఎక్కువ స్థానాల్లో ఓటమి చెందడానికి జనసేన చీల్చిన ఓట్లు కారణంగా  టీడీపీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.

ఏపీ రాష్ట్రాన్ని అభివృద్ది చేసేందుకు తాను శక్తివంచన లేకుండా ప్రయత్నాలు చేసినట్టుగా చంద్రబాబు చెప్పారు. తమ పార్టీ ఈ ఎన్నికల్లో ఎందుకు ఓటమి పాలయ్యిందో అర్థం కాలేదని పదే పదే చంద్రబాబునాయుడు ప్రస్తావించారు.ఓటమికి కూడ కారణాలు తెలియక పోవడంపై చంద్రబాబు అంతర్మథనానికి గురయ్యారు. 

రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి ఆయా జిల్లాల్లో పార్టీ స్థితిగతులపై సమీక్షలు నిర్వహించారు.  ఈ సమావేశం ముగిసిన తర్వాత చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులతో విదేశీ పర్యటనకు వెళ్లాడు. ఈ సమయంలోనే రాజ్యసభలో నలుగురు టీడీపీ ఎంపీలు  టీడీపీ పార్లమెంటరీ పక్షాన్ని బీజేఎల్పీలో విలీనం చేశారు.

ఈ నలుగురిలో ఇద్దరు ఎంపీలు చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు కావడం గమనార్హం. ఏపీలో టీడీపీ ఓటమి పాలైన తర్వాత  టీడీపికి చెందిన కీలక నేతలపై బీజేపీ,  వైసీపీ నేతలు వల వేస్తున్నారు.

కొందరు టీడీపీకి చెందిన నేతలు బీజేపీలో చేరారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడ వైసీపీకి జై కొట్టారు. టీడీపీలో సస్పెన్షన్ కు గురయ్యాడు.  ఈ నెలలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో వల్లభనేని వంశీ అసెంబ్లీలో టీడీపీ సభ్యుల స్థానంలో కాకుండా వేరే స్థానంలో కూర్చొన్నాడు. 

టీడీపీకి చెందిన  23 మంది ఎమ్మెల్యేల్లో కొందరు ఎమ్మెల్యేలు ఇతర పార్టీల్లో చేరేందుకు ఆసక్తిని చూపిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ఏపీ అసెంబ్లీలో టీడీపీకి ప్రతిపక్ష హోదా దక్కకుండా చేయాలనే వైసీపీ చేస్తోందని ప్రచారం సాగుతోంది.

టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు బీజేపీ లేదా వైసీపీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నారనే ప్రచారం కూడ సాగుతోంది.  మరికొందరు టీడీపీకి చెందిన కీలక నేతలు ఇతర  పార్టీల్లో చేరేందుకు ఆసక్తిగా ఉన్నారనే ఏపీ పొలిటికల్ సర్కిళ్లలో  ప్రచారం సాగుతోంది.

ఏపీ రాష్ట్ర రాజధాని విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడు రాజధానులు అంటూ  చేసిన ప్రకటన కూడ టీడీపీ చీఫ్ చంద్రబాబుకు తలనొప్పిని తెచ్చి పెట్టింది. మూడు రాజధానుల ప్రతిపాదనకు పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, కేఈ కృష్ణమూర్తి, కొండ్రు మురళిలు బహిరంగంగానే మూడు రాజధానుల ప్రతిపాదనలకు మద్దతిచ్చారు.

ఈ ఏడాది చంద్రబాబునాయుడు  అధికారాన్ని కోల్పోయాడు. పార్టీ నుండి కీలక నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ఈ తరుణంలో పార్టీని కాపాడుకోవడం కూడ చంద్రబాబుకు తలకు మించిన భారంగా మారింది.  వైఎస్ జగన్‌ దూకుడుగా పాలన సాగిస్తున్నాడు. ఏపీలో  మరో నాలుగేళ్ల పాటు చంద్రబాబునాయుడు పార్టీని కాపాడుకొంటూ ఎన్నికలకు సిద్దం కావాల్సి ఉంది.
 

click me!