డాక్టర్ సుధాకర్‌పై 353 సెక్షన్... దాడిచేసిన కానిస్టేబుల్ సస్పెండ్: విశాఖ సిపి ప్రకటన

By Arun Kumar PFirst Published May 16, 2020, 9:01 PM IST
Highlights

ఇటీవల ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడి సస్పెన్షన్ కు గురయిన డాక్టర్ సుధాకర్ ఇవాళ విశాఖపట్నంలో నానా హంగామా సృష్టించాడు. 

విశాఖపట్నం: ఇటీవల సస్పెన్షన్ కు గురైన ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ సుధాకర్ శనివారం విశాఖపట్నంలో నడిరోడ్డుపై హంగామా సృష్ఠించాడు. అక్కయ్యపాలెంలో నడిరోడ్డుపై అర్థనగ్నంగా పడుకున్నాడు. దుర్భాషలాడుతూ వాహనదారులను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని అతన్ని అదుపు చేయడానికి ప్రయత్నించారు. అతి కష్టం మీద పోలీసులు డాక్టర్ సుధాకర్ ను అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్ కు తరలించారు. 

అయితే వైసిపి ప్రభుత్వం కక్షపూరితంగానే డాక్టర్ సుధాకర్ ను అరెస్ట్ చేయించిందని ప్రతిపక్ష టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు. ఓ దళితుడి పట్ల ఇలా ప్రవర్తించడాన్ని తప్పుబడుతూ ప్రభుత్వం, వైసిపి పార్టీపై విమర్శలు చేస్తున్నారు. దీంతో సుధాకర్ అరెస్టుకు ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని విశాఖ సిపి ఆర్కే మీనా వివరణ ఇచ్చారు.  

''నగరంలోని అక్కాయపాలెం హైవే రోడ్డుపై ఒక వ్యక్తి  గందరగోళం  చేస్తున్నట్లుగా డయల్ 100 కి ఫిర్యాదు వచ్చింది. తక్షణమే నాల్గో పట్టణ పోలీసులు ఘటన స్థలానికి  చేరుకుని అతడిని అదుపుచేయడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో వివరాలు అడగ్గా అతడు నర్సీపట్నం ఆసుపత్రి లో సస్పెండ్ అయిన డాక్టర్ సుధాకర్ గా గుర్తించారు. గందరగోళం సృష్టిస్తున్న డాక్టర్ ని వారించే ప్రయత్నం చేసినప్పటికి వినకుండా ట్రాఫిక్ కానిస్టేబుల్ తో దురుసుగా ప్రవర్తించారు.  పోలీస్ సెల్ ఫోన్ లు లాక్కుని విసిరారు'' అని తెలిపారు. 

read more  విశాఖ నడిరోడ్డుపై అర్థనగ్నంగా పడుకున్న డాక్టర్ సుధాకర్: చంద్రబాబు స్పందన

''ప్రధాన జాతీయ రహదారి కావటం తో వాహనదారులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురువతారని డాక్టర్ సుధాకర్ ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించాం. డాక్టర్ మద్యం సేవించి ఉండడంతో అతన్ని ఆల్కహాల్ పరీక్షల నిమిత్తం కింగ్ జార్జి ఆసుపత్రికి తరలించాం'' అని తెలిపారు. 

''డాక్టర్ ను లాఠీతో  కొట్టాడని ఒక ట్రాఫిక్  కానిస్టేబుల్ ని  సస్పెండ్ చేసాము. అలాగే ఆల్కహాల్ పరీక్షలు అనంతరం డాక్టర్ పై 353 సెక్షన్ పెట్టి కేసు నమోదు చేస్తాము. ఇకపై పరిస్థితిని బట్టి చర్యలు ఉంటాయి. గత కొంత కాలంగా డాక్టర్ సుధాకర్ మానసిక సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు'' అని విశాఖ సిపి మీనా వెల్లడించారు. 
 

click me!