91 ఏళ్ల వయసులోనూ ఆయనింకా విద్యార్థే ... పీహెచ్‌డీ, డి.లిట్ పూర్తిచేసిన విశాఖవాసి

Arun Kumar PUpdated : May 16 2025, 11:47 AM IST

విశాఖపట్నంకు చెందిన డాక్టర్ ఎన్‌.ఎస్‌. ధనం 91ఏళ్ల వయసులో డి.లిట్ డిగ్రీ సాధించారు. 81లో పీహెచ్‌డీ చేసిన ఈయన ఇప్పటికీ తన చదువును కొనసాగిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. 

వయసు అంటే కేవలం ఒక సంఖ్య మాత్రమే... ఇది మన లక్ష్యానికి ఎప్పుడూ అడ్డుకాదని నిరూపించాడు విశాఖకు చెందిన ఎన్ఎస్ ధనం. చిన్నప్పటి నుండి చదువు విలువ తెలిసినవాడు కాబట్టి దాన్ని నిర్లక్ష్యం చేయలేదు. బాగా చదువుకుని మంచి ఉద్యోగం సాధించి జీవితాన్ని హ్యాపీగా గడిపాడు. అయితే వయసు పెరిగినా ఆయనకు విద్యపై మక్కువ ఏమాత్రం తగ్గలేదు. దీంతో రిటైర్మెంట్ తర్వాత మళ్లీ చదువుకోవడం ప్రారంభించాడు. ఇలా లేటు వయసులో అంటూ 91 ఏళ్లకు వియత్నాం నేషనల్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ ఆఫ్ లెటర్స్ (D.Litt) పొందాడు. అంతుకుముందు 2015లో 81 ఏళ్ల వయసులో ఆంధ్ర యూనివర్సిటీ నుంచి తత్వశాస్త్రంలో పీహెచ్‌డీ (PhD) డిగ్రీ పొందారు.

1934లో తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో సాధారణ మద్యతరగతి కుటుంబంలో జన్మించాడు ధనం. అతడి ప్రాథమిక విద్యాభ్యాసం మిసెస్ ఎ.వి.ఎన్ హై స్కూల్‌లో పూర్తయింది. ఆంధ్ర యూనివర్సిటీలో 1954లో బీఎస్సీ పూర్తి చేశారు. ప్రభుత్వరంగంలో లోయర్ డివిజన్ క్లర్క్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించిన ధనం, ఆ తర్వాత ప్రైవేట్ రంగానికి మారారు. విశాఖపట్నంలోని కాల్టెక్స్ ఆయిల్ రిఫైనింగ్ ఇండియా లిమిటెడ్‌ సహా ఇతర సంస్థల్లో పని చేసాడు. సుమారు నాలుగు దశాబ్దాల పాటు కార్పొరేట్ రంగంలో కీలక పదవులు నిర్వహించారు. చివరికి వైస్ ప్రెసిడెంట్‌, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌ హోదాల్లో సేవలందించారు.

తన ప్రొఫెషనల్ జీవితంలో దక్షిణ కొరియా, బహ్రైన్, ఒమాన్, ఫిలిప్పీన్స్ వంటి దేశాల్లో బాధ్యతలు నిర్వహించారు ధనం. 1994లో పదవీ విరమణ అనంతరం విద్యను కొనసాగించాలనే సంకల్పంతో ఉన్నత విద్యలో అడుగుపెట్టారు.

1970ల నుంచే భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలలో ఆయనకు ఆసక్తి పెరిగింది. డి.లిట్ పరిశోధనలో ఉచ్ఛారణ స్వేచ్ఛ (Free Will) మరియు విధి (Determinism) మధ్య సంబంధాన్ని పరిశీలించారు. ఈ మౌలిక జీవన పరమార్థాలపై అధ్యయనం చేశారు.

62 ఏళ్లపాటు వివాహ జీవితం కూడా సాఫీగా సాగింది...  ఆయన భార్య లక్ష్మి 2018లో మృతి చెందారు. దీంతో ఒంటరి అయిపోయిన ఆయన ప్రస్తుతం బెంగళూరులో ఓ వృద్ధాశ్రమంలో నివసిస్తున్నారు. పెద్ద కుమారుడు సుబ్బి (67) నార్వేలో మెరైన్ ఇంజనీర్‌గా, చిన్న కుమారుడు కృష్ణ ధనం (63) అమెరికాలో మోటివేషనల్ స్పీకర్‌గా, రచయితగా స్థిరపడ్డారు.

ప్రస్తుతం ధనం రోజూ వాకింగ్ చేస్తారు. స్నూకర్ ఆడటం, పుస్తకపఠనం, రచన వంటి కార్యకలాపాలతో మానసిక-శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. "మనస్సు చురుకుగా ఉండాలి. మనం ఎప్పుడూ జ్ఞాన ద్వారాన్ని తట్టాలి" అని డాక్టర్ ధనం అంటుంటారు.

Read more Articles on
click me!