కడప జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం... ఇద్దరు వ్యక్తులతో సహా పందులు మృతి

By Arun Kumar PFirst Published Nov 1, 2021, 10:13 AM IST
Highlights

కడప జిల్లాలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులతో పాటు భారీగా పందులు మృత్యువాతపడ్డాయి. 

కడప: ట్రాలీ ఆటోలో పందులను తరలిస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయి ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. ట్రాలీ ఆటో, మినీ లారీ ఎదురెదురుగా వేగంగా వచ్చి ఢీకొనడంతో పందులతో సహా వాటిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. 

ఈ దుర్ఘటనకు సబంధించిన వివరాలిలా ఉన్నాయి. kadapa district లోని  పుల్లంపేటకు చెందిన చప్పిడి సూరి పందుల పెంపకాన్ని చేపడుతుంటాడు. ఇందులో భాగంగా ఖాజీపేటలో కొన్ని పందులను కొనుగోలు చేసాడు. వీటిని ఆదివారం రాత్రి ఓ ట్రాలీ ఆటోలో ఎక్కించుకుని స్వగ్రామానికి బయలుదేరాడు. 

అయితే పందుల లోడ్ తో వెళుతున్న ఆటో ఒంటిమిట్ట మండలం మంటపంపల్లి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. వేగంగా వెళుతున్న ఆటోను ఎదురుగా అంతేవేగంతో వస్తున్న మినీ లారీ ఢీకొట్టింది. దీంతో ఆటో ఎగిరి రోడ్డుపక్కన పడిపోయింది. దీంతో ఆటోలోని పందులతో పాటు డ్రైవర్ శివారెడ్డి, సూరి అక్కడిక్కడే మృత్యువాతపడ్డారు. 

read more  ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడ్డ వాహనం.. 12 మంది మృతి..

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న ఒంటిమిట్ట పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆటోలో చిక్కుకున్న రెండు మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్ కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

ఇద్దరు గ్రామస్తులు రోడ్డుప్రమాదంలో మృతిచెందడంతో పుల్లంపేటలో విషాద వాతావరణం ఏర్పడింది. తమవారిని కోల్పోయిన కుటుంబసభ్యులు బోరున విలపిస్తున్నారు. రోడ్డు ప్రమాదానికి అతి వేగమే కారణమని తెలుస్తోంది. 

read more బైక్ స్టంట్‌.. ముందు టైర్ గాలిలో.. దూసుకెళ్లి ట్యాంకర్‌ను ఢీకొట్టిన బైకర్.. వీడియో వైరల్

ఇటీవల అనంతపురం జిల్లాలోని బత్తలపల్లి మండలం జ్వాలాపురం వద్ద జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డుప్రమాదం నలుగురిని బలితీసుకుంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి నలుగురు మృతి చెందారు. వీరంతా చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందినవారు. ఈ కుటుంబం కారులో ఓ వివాహ కార్యక్రమంలో పాల్గొనేందుకు అనంతపురం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

కారు ముందు వైపు టైరు ఒక్కసారిగా పేలడంతో వాహనం అదుపుతప్పి అనంతపురం నుంచి చెన్నై వెళ్తున్న లారీని బలంగా ఢీకొంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న అమ్మాజి(50), కుమారుడు రెడ్డి భాషా(25), కుమార్తె రేష్మ(30), అల్లుడు బాబు(36) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బాబు, రేష్మల కుమార్తె జస్మిత(5)కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో చిన్నారిని చికిత్స నిమిత్తం అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. 

సమాచారం అందుకున్న  పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కారులో చిక్కుకున్న మృతదేహాలను స్థానికుల సాయంతో బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కారు మంచి స్పీడులో వుండగా టైరు పేలడంతో ఇంత ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 

ఈ ప్రమాదంగురించి మరిచిపోకముందే తాజాగా కడప జిల్లాలో మరో ఘోరం చోటుచేసుకుంది. ఇలా రోడ్డుప్రమాదాలతో కొందరు ప్రాణాలు కోల్పోగా మరికొందరు తీవ్ర గాయాలపాలవుతున్నారు. ఎన్నో కుటుంబాలు అయినవారిని కోల్పోయి బాధపడుతున్నాయి. 

click me!