తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి భక్తులకు టీటీడీ ఓ కీలకమైన మార్పును తీసుకురానుంది. వేసవి సెలవుల సమయంలో భక్తుల అధిక రద్దీ కారణంగా బ్రేక్ దర్శనాలపై సిఫార్సు లేఖల స్వీకరణను తాత్కాలికంగా నిలిపేసిన టీటీడీ, మళ్లీ వాటిని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.
తాజా సమాచారం ప్రకారం, మే 15వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇచ్చే సిఫార్సు లేఖల ఆధారంగా బ్రేక్ దర్శనాలను మళ్లీ అనుమతించనున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని వారాలుగా తిరుమలలో భక్తుల రద్దీ కాస్త తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.ఇప్పటివరకు వేసవి సెలవుల నేపథ్యంలో సామాన్య భక్తులకు దర్శనావకాశం కల్పించేందుకు టీటీడీ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా, ప్రోటోకాల్ పరిధిలోకి వచ్చే వీఐపీలకు మాత్రమే బ్రేక్ దర్శనం అవకాశముంటుందని స్పష్టం చేసింది. మిగిలిన ఇతర సిఫార్సు లేఖలను నిలిపివేసినట్టు చెప్పింది.
అలాగే మే 1వ తేదీ నుంచి ప్రోటోకాల్ వీఐపీల బ్రేక్ దర్శనాల్లో మార్పులు తీసుకువచ్చారు. ఉదయం 6 గంటల నుంచి మాత్రమే స్వయంగా హాజరయ్యే వీఐపీలకు దర్శనాన్ని అనుమతిస్తున్నారు. ఈ చర్యలు అన్ని వేసవి సందడిని నియంత్రించేందుకు తీసుకున్నవే.ఇప్పుడు మళ్లీ సిఫార్సు లేఖలను స్వీకరించే అవకాశం కల్పించడం వల్ల, కొంతమంది భక్తులకు ఊరట లభించనుంది. అయితే దీనివల్ల సాధారణ భక్తులపై ఎటువంటి ప్రభావం పడకుండా ఉండేలా టీటీడీ జాగ్రత్తలు తీసుకుంటుందని భావిస్తున్నారు.
ఇదే సమయంలో భక్తులు ముందు నుంచే ఆన్లైన్ ద్వారా టోకెన్లు బుక్ చేసుకొని రావాలని అధికారులు సూచిస్తున్నారు. తిరుమలలో దర్శన వ్యవస్థ మరింత సవ్యంగా కొనసాగేందుకు టీటీడీ చేపడుతున్న ఈ నిర్ణయాలు, భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకునే జరిగుతున్నాయని తెలుస్తోంది.