TTD: తిరుమల స్వామి వారి భక్తులకు అదిరిపోయే వార్త..ఆ నెల టిక్కెట్ల విడుదల ఎప్పుడంటే..!

Bhavana ThotaPublished : May 17, 2025 4:52 AM

ఆగస్టు నెల దర్శనాలు, సేవలు, వసతుల కోసం టీటీడీ టికెట్ విడుదల తేదీలను ప్రకటించింది. మే 19 నుంచి ఆన్‌లైన్ బుకింగ్ ప్రారంభం కానుంది.

తిరుమల శ్రీవారి దర్శనాన్ని కోరుకుంటున్న భక్తులకు టీటీడీ ఓ ముఖ్యమైన సమాచారాన్ని అందించింది. ఆగస్టు నెలకు సంబంధించిన అన్ని దర్శన, సేవా, వసతి కోటాలను మే 19వ తేదీ నుంచి దశలవారీగా ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

భక్తులు ఎక్కువగా ఎదురుచూసే ఆర్జిత సేవల టికెట్లు మే 19 ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రానున్నాయి. ఈ టికెట్ల కోసం ఎలక్ట్రానిక్ డిప్ ప్రక్రియను టీటీడీ మే 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఉంచుతుంది. మే 21 నుంచి 23 మధ్యాహ్నం 12 గంటలలోగా చెల్లింపు పూర్తి చేస్తే టికెట్లు మంజూరవుతాయి.

కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవల కోసం ప్రత్యేకంగా టికెట్లు మే 22న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. ఇదే రోజున మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, వాటికి సంబంధించిన దర్శన స్లాట్‌లు విడుదల అవుతాయి.ఆగస్టు నెలలో అంగప్రదక్షిణం టోకెన్లు మే 23న ఉదయం 10 గంటలకు విడుదల కానుండగా, అదే రోజున ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు టికెట్లు అందుబాటులోకి రానున్నాయి.

వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న భక్తుల కోసం ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్ల కోటాను మే 23 మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. ఇక ఆగస్టు నెల స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లు మే 24న ఉదయం 10 గంటలకు విడుదల కానుండగా, తిరుమల–తిరుపతిల్లో గదుల కోటా అదే రోజున మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులోకి రానుంది.

జులై నెలలో జరిగే శ్రీవారి సేవ, పరకామణి సేవ, నవనీత సేవలతో పాటు టీమ్ లీడర్లు చేయబోయే సేవలకు సంబంధించిన టికెట్లు మే 29న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది.టికెట్లను బుక్ చేసుకోవాలనుకునే భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ttdevasthanams.ap.gov.in ద్వారా తమకు కావాల్సిన సేవలను ఎంచుకొని ముందుగానే బుకింగ్ చేసుకోవాలనీ సూచించింది.

Read more Articles on
click me!