Andhra Pradesh: ఏపీలో భారీ ప్రాజెక్టు.. రూ. 22 వేల కోట్ల పెట్టుబ‌డి

Published : May 16, 2025, 10:20 PM IST
Andhra Pradesh: ఏపీలో భారీ ప్రాజెక్టు.. రూ. 22 వేల కోట్ల పెట్టుబ‌డి

సారాంశం

ఉపాధి, పెట్టుబ‌డులు ల‌క్ష్యంగా కూట‌మి ప్ర‌భుత్వం శ‌ర‌వేగంగా ముందుకు సాగుతోంది. ఇప్ప‌టికే రాష్ట్రంలో ప‌లు దిగ్గ‌జ సంస్థ‌లు పెట్టుబ‌డులు పెట్టాయి. కాగా తాజాగా ఈ జాబితాలోకి మ‌రో సంస్థ వ‌చ్చి చేరింది. భార‌త‌దేశంలోనే అతిపెద్ద పున‌ర్వినియోగ విద్యుత్ ప్రాజెక్టుకు శుక్ర‌వారం నాంది ప‌డింది.   

వివ‌రాల్లోకి వెళితే.. గుంత‌కల్లు నియోజకవర్గంలోని బేతపల్లె గ్రామంలో భారతదేశంలోనే అతిపెద్ద పునర్వినియోగ విద్యుత్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు ReNew కంపెనీ రూ.22,000 కోట్లు పెట్టుబడి పెట్టబోతోంది. ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ రంగానికి భారీ ప్రోత్సాహం కలిగించనుంది.

ప్రపంచ ఆర్థిక వేదిక (డావోస్) లో మానవ వనరులు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్, ReNew చైర్మన్‌, సీఈఓ సుమంత్ సిన్హా తో చర్చలు జరిపారు. ఆ సమావేశం అనంతరం ReNew సంస్థ ఆరు సంవత్సరాల విరామం తర్వాత మళ్లీ రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకొచ్చింది.

ఈ నేప‌థ్యంలో మంత్రి నారా లోకేశ్ శుక్ర‌వారం ఈ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేశారు. ప్రాజెక్ట్ తొలి దశలో 587 మెగావాట్ల సౌర విద్యుత్, 250 మెగావాట్ల ప‌వ‌న‌ విద్యుత్‌, 415 మెగావాట్ గంటల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (BESS) ఏర్పాటుకు రూ. 7,000 కోట్లు ఖ‌ర్చు చేయ‌నున్నారు. 

ప్రాజెక్ట్ మొత్తం పూర్తయిన తర్వాత 1800 మెగావాట్ల సౌర విద్యుత్, 1 గిగావాట్ ప‌వ‌న‌ విద్యుత్, 2000 మెగావాట్ గంటల బ్యాటరీ నిల్వ సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ ప్రాజెక్ట్, రాష్ట్ర ప్రభుత్వం 2024 అక్టోబర్‌లో ప్రవేశపెట్టిన "ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ (ICE) పాలసీ" కింద మొదటి పెద్ద ప్రాజెక్టుగా నిలుస్తోంది. ఈ పాలసీ ద్వారా గ్రీన్ ఇన్వెస్టర్లకు పలు రకాల ప్రోత్సాహాలు, వేగవంతమైన అనుమతులు లభిస్తాయి.

గత ప్రభుత్వ కాలంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు రద్దవడంతో ReNew సంస్థ అప్పట్లో రాష్ట్రానికి పెట్టుబడులు నిలిపివేసింది. అయితే రాష్ట్రంలో ప్ర‌భుత్వం మారిన త‌ర్వాత ఈ సంస్థ మ‌ళ్లీ పెట్టుబ‌డులు పెట్టేందుకు ఆస‌క్తి చూపిస్తోంది. 2029 నాటికి 72 గిగావాట్ల పునర్వినియోగ విద్యుత్ లక్ష్యాన్ని చేరుకోవాలన్న ఆంధ్రప్రదేశ్ లక్ష్యంలో ఇది కీలక మైలు రాయిగా నిలవనుంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Jana Sena 13th Formation Day: వినూత్నంగా జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు| Asianet News Telugu
AP Food Commission Chairman: ఉప్మాలో పురుగులు ఫిర్యాదు చేసిన పేరెంట్స్| Asianet News Telugu