తెలుగు సినీ నటుడు అలీ శుక్రవారం నాడు బీజేపీ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు.
న్యూఢిల్లీ: తెలుగు సినీ హస్యనటుడు అలీ శుక్రవారంనాడు ఢిల్లీలోని బీజేపీ కార్యాలయానికి వెళ్లారు. బీజేపీ కార్యాలయంలో అలీ ప్రత్యక్షం కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది. వ్యక్తిగత పని విషయమై బీజేపీ కార్యాలయానికి వెళ్లినట్టుగా అలీ చెబుతున్నారు.
Also read:వైసీపీలోకి అలీ: పవన్ తో భేటీ,మతలబేంటీ?
గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు సినీ నటుడు అలీ వైసీపీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో అలీ వైసీపీ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు. ఎన్నికల తర్వాత అలీకి మంచి పదవిని ఇస్తారని ప్రచారం సాగింది. ఏపీ రాష్ట్రంలో జగన్ సర్కార్ ఏర్పాటై ఏడు మాసాలైంది.కానీ, అలీకి ఎలాంటి నామినేటేడ్ పదవి దక్కలేదు. ఈ సమయంలో అలీ బీజేపీ కార్యాలయంలో ప్రత్యక్షం కావడం చర్చకు దారి తీసింది.
ఈ సమయంలో సినీ నటుడు అలీ న్యూఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో శుక్రవారం నాడు ఆకస్మాత్తుగా ప్రత్యక్షం కావడం ప్రాధాన్యతను సంతరించుకొంది. సినీ నటుడు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కు అలీ అత్యంత సన్నిహితుడుగా చెబుతారు.
అయితే ఎన్నికల సమయంలో జనసేనలో చేరకుండా అలీ వైసీపీలో చేరారు. ఎన్నికల ముందు టీడీపీలో చేరాలని ఆ పార్టీ ఆహ్వానించింది. కానీ, టిక్కెట్ల కేటాయింపు విషయంలో సరైన హామీ దక్కని కారణంగా అలీ వైసీపీలో చేారారు.
సినీ పరిశ్రమకు చెందిన పృథ్వీకి జగన్ ఎస్వీబీసీ ఛైర్మెన్ పదవిని ఇచ్చారు. విజయ్ చందర్ కు ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మెన్ పదవిని ఇచ్చారు. పోసాని కృష్ణ మురళి కూడ జగన్ కు మద్దతు ఇచ్చారు. పోసాని కృష్ణ మురళికి, అలీకి ఎలాంటి పదవులు ఇవ్వలేదు.
పవన్ కళ్యాణ్ ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో సమావేశాల్లో పాల్గొనేందుకు రెండు రోజుల క్రితం ఢిల్లీకి వెళ్లారు. ఈ నెల 23వ తేదీన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను పవన్ కళ్యాణ్ కలిశారు. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ సన్నిహితుడుగా పేరున్న అలీ ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో ప్రత్యక్షం కావడం రాజకీయంగా చర్చకు తెరతీసింది. .