
రాష్ట్రవ్యప్తంగా మున్సిపల్ వార్డులకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచింది. వివిధ మున్సిపాలిటీల్లోని 37 వార్డులకు ఎన్నికలు అవసరమయ్యాయి. అయితే, వీటిల్లో 21 వార్డులను టిడిపి ఏకగ్రీవంగా సొంతం చేసుకున్నది. ఎన్నికలు జరిగిన 16 వార్డుల్లో 13 చోట్ల టిడిపి విజయం సాధించింది. దాంతో ‘వరదన పోతున్న వ్యక్తికి గడ్డిపోచ దొరికినట్లైం’ది. గడచిన మూడేళ్ళుగా రాష్ట్రంలో ఎక్కడా ఎన్నికలు జరగలేదు. దానికితోడు ప్రజావ్యతిరేకత పెరిగిపోతోంది. ఇటీవలే జరిగిన ఎంఎల్సీ ఎన్నికల్లో మూడింటిలో గెలిచినా నాలుగింటిలో ఓడిపోయింది.
ఇటువంటి నేపధ్యంలో మున్సిపల్ వార్డుల ఎన్నికలు వచ్చాయి. దాంతో వార్డులను గెలుచుకోవటం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు చంద్రబాబు. అందుకే జిల్లాలోని నేతలందరికీ వార్డుల్లో గెలుపును లక్ష్యంగా నిర్దేశించారు. మామూలుగా అయితే అసలు జిల్లా మంత్రి, ఎంఎల్ఏలు, ఎంపిలు ఎవరు కూడా పట్టించుకోరు. అటువంటిది ముఖ్యమంత్రి ఈ విషయాన్ని కూడా ప్రతిష్టగా తీసుకున్నారు. దాంతో నేతలంతా రంగంలోకి దిగారు. ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకన్న ఎన్నికల్లో కూడా మంగళగిరి, రాయచోటి మున్సిపాలిటీల్లోని వార్డుల్లో వైసీపీ గెలవగా ఓ చోట స్వతంత్ర అభ్యర్ది గెలవటం గమనార్హం. రాజధాని ప్రాంతంలోని మంగళగిరి మున్సిపాలిటిలో టిడిపికి పెద్దషాకే తగిలింది. ఇక్కడ వైసీపీ అభ్యర్ధి గెలవటం చర్చనీయాంశమైంది.
అదే సమయంలో తమ్ముళ్ళ ఓవర్ యాక్షన్ కూడా బట్టబయలైంది. గుడివాడ మున్సిపాలిటీలోని 19వ వార్డుకు జరిగిన ఎన్నికల్లో టిడిపి గెలిచింది. అయితే, గెలిచిన వాళ్ళు నేరుగా పార్టీ కార్యాలయానికో లేక వారి ఇళ్ళకో పోకుండా మధ్యలో వైసీపీ కార్యాలయం వద్ద ఆగారు. అంతటితో ఆగకుండా వైసీపీ కార్యలయం వద్ద టపాకాయలు కాల్చి వైసీపీ శ్రేణులను రెచ్చగొట్టరు. అదే సమయంలో అక్కడికి వచ్చిన వైసీపీ ఎంఎల్ఏ కొడాలి నానిని చూసి టిడిపి నేతలు రెచ్చిపోయారు. దాంతో నాని కూడా వారిపై తిట్లదండకం అందుకున్నారు. దాంతో అక్కడ ఉద్రిక్తత తలెత్తింది. ఇంతలో పోలీసులు జోక్యం చేసుకుని రెండు వర్గాలను అక్కడి నుండి పంపేయటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.