
నంద్యాల ఉప ఎన్నికలో అభివృద్ధి వల్ల టీడీపీ గెలవలేదని... డబ్బు, అధికార దుర్వినియోగంతోనే గెలిచిందని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం తీవ్ర ఆరోపణలు చేశారు. సొల్లు ఉపన్యాసాలతో చంద్రబాబు కాలం వెళ్లదీస్తున్నారని ఎద్దేవా చేశారు. కాపులకిచ్చిన వాగ్దానం ప్రభుత్వం నీరుగార్చుతుందని ఆవేధన వ్యక్తం చేశారు.
"మేమేమైనా ఉగ్రవాదులమా..? ఇచ్చిన హామీలను అమలు చేయమని అడగడమే తప్పా..?" అంటూ కాపు నేత తెలుగుదేశం ప్రభుత్వంపై మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమైనా హిట్లరా, ఆయన ఏం మాట్లాడినా చెల్లుతుందా.? అని ప్రశ్నించారు. ఎవరికీ లేని ఆంక్షలు తమ పాదయాత్రకు విధించారని... పోలీసులు తమని జైలులో ఖైదీల భావిస్తున్నారని, ఇంటి నుండి బయటికి వస్తే నిర్భందిస్తున్నారని ఆయన పెర్కొన్నారు. ఎవరి అనుమతి తీసుకుని గతంలో చంద్రబాబు బాబ్లీ ప్రాజెక్టు వద్దకు వెళ్లారని ముద్రగడ ప్రశ్నించారు.
ఈ నెల 30న అన్ని జిల్లాల కాపు నేతలతో సమావేశం నిర్వహించి... పాదయాత్రతో పాటు భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామని తెలిపారు. రిజర్వేషన్లను సాధించేంత వరకు తాము వెనకడుగు వేయమని చెప్పారు.
తాజా విశేషాల కోసం కింద క్లిక్ చేయండి