రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థుల భవితకు మరణశాసనం.. సీఎంకు నారా లోకేశ్ బహిరంగ లేఖ

By telugu teamFirst Published Oct 28, 2021, 8:20 PM IST
Highlights

జగన్ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో విద్యార్థుల భవిత ప్రశ్నార్థకం కానుందని టీడీపీ నేత నారాలోకేశ్ మండిపడ్డారు. గొప్పలకు పోయి అప్పులపాలైన జగన్ ప్రభుత్వం ఎయిడెడ్ విద్యా సంస్థల ఆస్తులపై కన్నేసిందని, అందుకే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నదని ఆరోపణలు చేశారు. ఈ విషయంపై ఆయన సీఎం జగన్ మోహన్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.

అమరావతి: CM Jagan Mohan Reddy ప్రభుత్వంపై TDP జాతీయ ప్రధాన కార్యదర్శి Nara Lokesh విరుచుకుపడ్డారు. జగన్ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత, మూర్ఖపు నిర్ణయాలతో Aided Schools డెడ్ అయిపోతాయని,
లక్షలాది మంది విద్యార్థులకు మరణశాసనాలవుతున్నాయని విచారం వ్యక్తం చేశారు. ఒక్క విద్యా వ్యవస్థను నాశనం చేస్తే అన్ని వ్యవస్థలనూ ధ్వంసం చేయవచ్చనే తత్వవేత్త మాకియవెల్లి మాటలను జగన్ పాటిస్తున్నట్టు
ఆరోపించారు. అమ్మ ఒడి ఇవ్వడానికి.. కొడుకు బడిని బలిపీఠం ఎక్కిస్తారా? అంటూ ప్రశ్నిస్తూ బహిరంగ లేఖ రాశారు.

సీఎం జగన్ ప్రభుత్వం గొప్పలకు పోయి అప్పుల్లో కూరుకుపోయిందని, అందుకోసమే ఎయిడెడ్ పాఠశాలలు, కాలేజీల భూములు, విద్యాసంస్థల ఆస్తులను చేజిక్కించుకునే ప్రమాదకరమైన నిర్ణయాలు తీసుకుంటున్నదని
నారా లోకేశ్ ఆరోపణలు చేశారు. అందుకే వైజాగ్, కాకినాడ గుంటూరులలో.. రాష్ట్రవ్యాప్తంగా ఎయిడెడ్ పాఠశాలల మూసివేతకు వ్యతిరేకంగా విద్యార్థులు, తల్లిదండ్రులు రోడ్లెక్కి నిరసనలు చేస్తున్నారని పేర్కొన్నారు.
అయినా, ఆ మూర్ఖ నిర్ణయాన్ని సమర్థించుకోవడమేంటని ప్రశ్నించారు. 

Also Read: ఒక చెంప మీద కొడితే.. రెండు చెంపలు వాయగొడతాం, పోలీసులకూ శిక్ష తప్పదు: లోకేశ్ వ్యాఖ్యలు

టీఆర్ఎస్ ప్లీనరీలో తెలంగాణ సీఎం చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. కలలు కనే ధైర్యం లేని దయనీయస్థితిలో ఆంధ్రులున్నారని తెలంగాణ సీఎం కేసీఆర్ ఎద్దేవా చేయడం జగన్‌కు ఏమనిపించడం లేదేమో కానీ,
ఐదు కోట్ల ఆంధ్రులు అవమానంగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వం నిర్ణయాలతో రాష్ట్రంలో 2,203 పాఠశాల్లో 1,96,313 మంది విద్యార్థులు, 182 జూనియర్ కాలేజీల్లో 71,035 మంది విద్యార్థులు, 116 డిగ్రీ
కాలేజీల్లో 2.50 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకం కానుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎయిడెడ్ సంస్థల్లో ప్రభుత్వ వేతనాలతో పాఠశాలల్లో 7,238 మంది, జూనియర్ కాలేజీల్లో 721 మంది, డిగ్రీ
కాలేజీల్లో 1,347 మంది బోధనా సిబ్బంది పనిచేస్తున్నారని వివరించారు. ప్రభుత్వానికి ఆస్తులు, సిబ్బందిని అప్పగించని యాజమాన్యాలు మూసివేత ప్రకటనలు చేస్తుంటే అటు విద్యార్థులు, ఇటు సిబ్బంది పరిస్థితి
అగమ్యగోచరంగా మారిందని తెలిపారు. 

నిరుపేదలను విద్యకు దూరం చేయడాన్ని టీడీపీ వ్యతిరేకిస్తున్నదని, తూతూ మంత్రపు కమిటీలు వేసి అనుకూల రిపోర్టులు తెచ్చుకునే ప్రభుత్వ తీరు మరోసారి తేటతెల్లమైందని నారా లోకేశ్ ఆరోపించారు. రత్న కుమారి
కమిటీ ఎవరితో చర్చించకుండానే ప్రభుత్వం కోరిన నివేదిక ఇచ్చిందని పేర్కొన్నారు. కాంట్రాక్టు లెక్చరర్లను పర్మినెంట్ చేస్తామని హామీనిచ్చి ఇప్పుడు 750 మంది కాంట్రాక్టు లెక్చరర్లను ఉద్యోగాల నుంచి తొలగించే కుట్ర
చేయడమేంటని ప్రశ్నించారు. నష్టపోయినవారందరికీ న్యాయం జరిగే వరకు టీడీపీ పోరాడుతుందని స్పష్టం చేశారు.

Also Read: ఆ ఆస్తులను కబళించే కుట్ర... జగన్ సర్కార్ ఉబలాటం అందుకే: టీడీపీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి

మాకు అమ్మ ఒడి వద్దు.. మా పిల్లలు చదుకోవడానికి పాఠశాలలు కావాలని అడుగుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు సీఎం జగన్ ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. చదువుకోవడానికి బడి లేకుండా చేయం సరికాదని రోడ్ల మీదకు వచ్చి రోదిస్తున్న పిల్లలను ఎలా ఓదారుస్తారని అడిగారు. ఎయిడెడ్ విద్యాసంస్థల ఆస్తులపై కన్నేసిన సీఎం జగన్ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్ గురించి ఆలోచించకపోవడం దుర్మార్గమని ఆగ్రహించారు. ఎయిడెడ్ విద్యా సంస్థలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఒక్క స్కూలు కూడా మూతపడకుండా చూడాలని తెలిపారు.

click me!