ఆర్టీసీ ఛార్జీల పెంపు.. ఆయన జగన్ మోసపు రెడ్డి, నిజం చెప్పే నైజం లేదు: నారా లోకేష్

By Siva KodatiFirst Published Apr 14, 2022, 9:39 PM IST
Highlights

ఆర్టీసీ ఛార్జీల పెంపుకు సంబంధించి సీఎం వైఎస్ జగన్‌పై ఫైరయ్యారు టీడీపీ నేత నారా లోకేష్.  ఆర్టీసీ ఛార్జీల బాదుడుతో ప్రజల నుండి అదనంగా రూ.1500 కోట్లు కొట్టేస్తున్నారంటూ లోకేష్ ఆరోపించారు
 

ఆర్టీసీ ఛార్జీల పెంపు (rtc charges hike) విషయంలో జగన్ మోసపు రెడ్డి (ys jagan) అని మరోసారి నిరూపించుకున్నారంటూ ఫైరయ్యారు టీడీపీ (tdp) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (nara lokesh). గురువారం గుంటూరు జిల్లా మంగళగిరిలో (mangalagiri) ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. రూ.700 కోట్ల భారమే అన్నారని, కానీ వాస్తవంగా పెంచింది రూ.1500 కోట్లని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్టీసీ ఛార్జీల బాదుడుతో ప్రజల నుండి అదనంగా రూ.1500 కోట్లు కొట్టేస్తున్నారంటూ లోకేష్ ఆరోపించారు. అధికారంలోకి రాగానే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తానన్న జగన్ మోసపు రెడ్డి 7 సార్లు విద్యుత్ బిల్లులు పెంచారని ఆయన దుయ్యబట్టారు. 

విద్యుత్ ఛార్జీలు, పెట్రోల్, డీజిల్ ధరలు, నిత్యావసర సరుకుల ధరలు, గ్యాస్ ధర పెరిగి బ్రతకడం భారంగా మారిందని ప్రజలు గగ్గోలు పెడుతున్నారని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి పన్ను పెంచి, చెత్త పన్ను వేసిన చెత్త ప్రభుత్వం ఇదంటూ ఆయన ఫైరయ్యారు. ఇంటి పన్ను, చెత్త పన్నును వాలంటీర్లు ముక్కు పిండి వసూలు చేస్తున్నారని... కట్టక పోతే సంక్షేమ కార్యక్రమాల డబ్బు మినహాయించుకుంటున్నారని లోకేష్ చెప్పారు. 

చెత్త పన్ను వసూలు చేస్తున్నారు కానీ చెత్త ఎత్తే నాధుడు లేడని.. గ్రామాల్లో పరిశుభ్రత లోపించిందని ఆరోపించారు. కనీసం డ్రైన్లు కూడా శుభ్రం చెయ్యడం లేదని.. పరిసరాలు పరిశుభ్రంగా లేక ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. చెత్త పన్ను కట్టించుకొని చెత్త ఎత్తకపోతే ప్రజా ప్రతినిధుల ఇంటి ముందు చెత్త పొసే రోజు దగ్గర్లోనే ఉందని ఆయన జోస్యం చెప్పారు. జగన్ మోసపు రెడ్డి అనేక అబద్దాలు ఆడి ముఖ్యమంత్రి అయ్యారని.. నిజం చెప్పడం ఆయన నైజం కాదంటూ లోకేష్ దుయ్యబట్టారు. 

సొంత బాబాయ్‌ని లేపేసి మా నాన్న హత్య చేయించారని చెప్పిన జగన్ మోసపు రెడ్డి ఇప్పుడేం సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు. 
కమ్మ సామాజిక వర్గానికే డిఎస్పి పదోన్నతులు అని ఆరోపణ చేసిన జగన్ మోసపు రెడ్డి అసెంబ్లీ సాక్షిగా తాను అబద్దం ఆడానని ఒప్పుకున్నారని లోకేష్ గుర్తుచేశారు. ఎస్పి పదోన్నతుల్లో అన్ని వర్గాల వారు ఉన్నారని అసెంబ్లీలో వైసిపి ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే చేతగానితనంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని లోకేష్ ఫైరయ్యారు. 

6 నెలలు ముందే నియోజకవర్గ అభివృద్ధి చాలు మంత్రి పదవి వద్దు అని సీఎంకి ఎమ్మెల్యే చెప్పారట అంటూ ధ్వజమెత్తారు. మరి మంగళగిరికి ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయించిన రూ.2600 కోట్లు ఎక్కడికి పోయాయని లోకేష్ నిలదీశారు. కనీసం నిధుల్లో ఒక్క శాతం తీసుకురాలేని ఎమ్మెల్యేని చేతగాని వాడు అనకపోతే ఏమనాలన్నారు. మూడేళ్ళ నుండి వేస్తున్న గౌతమ బుద్దా రోడ్డుకి కూడా మున్సిపాలిటీ జనరల్ ఫండ్స్‌ని వినియోగించారని లోకేష్ వ్యాఖ్యానించారు. 

మున్సిపాలిటీలో మౌలిక వసతులు కల్పించడానికి ఉపయోగించే నిధులు రోడ్డు నిర్మాణం కోసం వాడటం చేతగాని తనమేనంటూ ఆయన దుయ్యబట్టారు. గడప గడపకి వెళ్లాలని వైసిపి పిలుపు ఇచ్చినా ఎమ్మెల్యే వెళ్లడం లేదని లోకేష్ చెప్పారు. ప్రజలు నిలదీస్తారు అన్న భయంతోనే గౌతమ బుద్దా రోడ్డు చుట్టూ రౌండ్లు కొట్టి వెళ్లిపోతున్నారని ఆయన సెటైర్లు వేశారు. అభివృద్ధి నిల్లు... జేసిబి‌తో పేదల ఇళ్లు కూల్చివేతలు ఫుల్లు అని లోకేష్ కామెంట్స్ చేశారు. 

click me!