
విశాఖపట్నం : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఏడాది సెప్టెంబర్ నుండే విశాఖ రాజధానిగా పాలన సాగిస్తామని ప్రకటించారు. సెప్టెంబర్ నాటికి తన కాపురం విశాఖకు మార్చనున్నట్లు ఉత్తరాంధ్ర గడ్డపైనే కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ వ్యాఖ్యలపై మాజీ మంత్రి, టిడిపి నేత బండారు సత్యనారాయణమూర్తి స్పందిస్తూ సంచలన కామెంట్స్ చేసారు. జగన్ విశాఖలో కాపురం పెట్టడంవెనక అసలైన కారణం వేరే వుందన్నారు. సీఎం సతీమణి వైఎస్ భారతి కనుసన్నల్లోనే విశాఖలో భూదందాలు జరుగుతున్నాయని... అందువల్లే జగన్ ఇక్కడ కాపురం పెడతానని అంటున్నారని మాజీ మంత్రి ఆరోపించారు.
ఏపీలో సినిమా రంగ అభివృద్దిలో భాగంగా గత టిడిపి ప్రభుత్వం రామానాయుడు స్టూడియోకి విశాఖలో భూమి కేటాయించిందని సత్యనారాయణ మూర్తి అన్నారు. విలువైన ఈ భూమిపై సీఎం జగన్ కన్ను పడిందని... అధికారంలోకి వచ్చిన నాటినుండి ఆ స్థలాన్ని చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఆ స్థలాన్ని ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం వాడుకుని అక్రమంగా సంపాదించాలని చూస్తున్నారని మాజీ మంత్రి ఆరోపించారు.
వీడియో
సినీ రంగానికి కేటాయించిన భూమిలో భారీ కట్టడాలకు అధికారుల నుండి అనుమతి కూడా లభించిందన్నారు. చట్టవిరుద్దంగా భారీ విల్లాలు నిర్మించి బినామీల పేరుతో అమ్ముకోవాలని చూస్తున్నారని అన్నారు. వీటిని భవిష్యత్ లో రద్దు చేస్తామని బండారు సత్యనారాయణ మూర్తి హెచ్చరించారు.
రామానాయుడు స్టూడియోకు ఇచ్చిన 33 ఎకారాల్లో 17 ఎకరాలకు పవర్ ఆఫ్ అటార్నీ జీవీఎంసీ కమిషనర్ కి ఇచ్చారని మాజీ మంత్రి తెలిపారు. తెలంగాణకు చెందిన ఓ నిర్మాత జగన్మోహన్ రెడ్డికి సురేష్ ప్రొడక్షన్స్ కు మధ్య మధ్యవర్తిత్వం చేస్తున్నారన్నారు. లేఅవుట్ డెవలప్ అయ్యాక , విల్లాలు వచ్చాక బినామీ రిజిస్ట్రేషన్ లు చేయబోతున్నారని ఆరోపించారు. ఆ తర్వాత వాటిని అమ్ముకుని భారీగా డబ్బులు వెనకేసుకోవాలని చూస్తున్నారని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ఆరోపించారు.