
సదావర్తి భూముల విషయంలో సుప్రింకోర్టులో కుడా ప్రభుత్వానికి షాక్ తగిలింది. సదావర్తి భూముల వేలాన్ని నిలిపివేయాలంటూ వేసిన పిటీషన్ను కోర్టు తోసిపుచ్చింది. సత్రానికి చెందిన తమిళనాడులోని 84 ఎకరాలను కాపు కార్పొరేషన్ ఛైర్మన్ రామానుజయ్యకు రూ. 22 కోట్లకే కారుచౌకగా ప్రభుత్వం కట్టబెట్టిన సంగతి అందరికీ తెలిసిందే.
ఎప్పుడైతే విషయం వెలుగుచూసిందో వెంటనే వైసీపీ ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టులో కేసు వేసారు. వందల కోట్ల విలువైన భూమిని నామినేషన్ పై భూములను కట్టబెట్టడాన్ని ఆళ్ళ ప్రశ్నించారు. దాంతో పిటీషన్ను పరిశీలించిన కోర్టు ప్రభుత్వానికి తలంటుపోసింది.
దాంతో అప్పటి నుండి కేసు అనేక మలుపులు తిరుగుతోంది. కోర్టు ఆదేశాలతో భూములను మళ్ళీ వేలం వేయమని, లేకపోతే పిటీషనర్ అంతకన్నా ఎక్కువ ధర ఇచ్చే పక్షంలో పిటీషనర్ కే ఇవ్వాలంటూ చెప్పింది. అంతేకాకుండా మళ్ళీ వేలం వేసేట్లైతే జాతీయస్ధాయిలో ప్రకటనలు ఇచ్చి వేలం వేయాలంటూ ఆదేశించింది. అయితే, 22 రూ. కోట్లకన్నా ధర రాదని ప్రభుత్వం చెప్పగా కోర్టు ఆదేశాల మేరకు ఆళ్ళ రూ. 27.14 కోట్లు చెల్లించేందుకు ముందుకొచ్చారు. అంతేకాకుండా ఆ మొత్తానికి డిడిలు కట్టి దేవాదాయ శాఖకు అందచేసారు. దాంతో ప్రభుత్వం గొంతులో పచ్చి వెలక్కాయపడింది.
ఇంతలో సదావర్తి భూములను అసలు వేలమే వేయకూడదంటూ సుప్రింకోర్టులో ఓ పిటీషన్ పడింది. ఆ పిటీషన్ను మంగళవారం విచారించిన సుప్రింకోర్టు ప్రభుత్వానికి బాగా తలంటింది. ఎట్టి పరిస్ధితిలోనూ వేలం ఆపేందుకు లేదని స్పష్టంగా ప్రకటించింది. అంతేకాకుండా పిటీషనర్ (ఆళ్ళ)కుడా వేలంలో పాల్గొనాలని చెప్పింది. మోసం జరుగుతుంటే కళ్లుమూసుకుని కూర్చోలేమని సుప్రిం వ్యాఖ్యానించటం గమనార్హం.
దాంతో ప్రభుత్వం నిర్ణయించిన రూ. 22 కన్నా ఎక్కువ ధర రావటం ఖాయమైపోయింది. ఎందుకంటే, గతంలోనే ఆళ్ళ 27.14 కోట్లు చెల్లించారు. ఇపుడు దానికన్నా ఎక్కువ ఎవరు చెల్లిస్తే వాళ్ళకు భూములు సొంతమవుతాయి. లేకపోతే ఆళ్ళకు దక్కుతాయి. అంతేకానీ రామానుజయ్యకు మాత్రం భూములు దక్కే అవకాశమే లేదని తేలిపోయింది.