విశాఖ జిల్లాలో ఆరుగురి హత్య: అక్రమ సంబంధమే కారణం, తప్పించుకున్న విజయ్

By telugu teamFirst Published Apr 15, 2021, 11:57 AM IST
Highlights

ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు హత్యకు గురి కావడానికి అక్రమ సంబంధమే కారణమని పోలీసులు తేల్చారు. హత్యకు గురైన రామారావు కుమారుడు విజయ్ కు నిందితుడి కూతురితో అక్రమ సంబంధం ఉన్నట్లు భావిస్తున్నారు.

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లా జుత్తాడ గ్రామంలో జరిగిన ఆరుగురి హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు తేల్చారు. నిందితుడు అప్పలరాజు కూతురితో ఆ కుటుంబానికి చెందిన విజయ్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఉన్నట్లు భావిస్తున్నారు. ఆ కారణంగానే అప్పలరాజు విజయ్ కుటుంబాన్ని మట్టుబెట్టినట్లు తెలుస్తోంది. 

అప్పలరాజు దాడి నుంచి రామారావు కుమారుడు విజయ్ తప్పించుకున్నాడు. అతను ఇంట్లో లేకపోవడంతో ప్రాణాలతో మిగిలాడు. అప్పలరాజు దాడిలో రామారావు సహా ఆరుగురు కుటుంబ సభ్యులు మరణించారు. అప్పలరాజు, రామారావు కుటుంబాలు ఇరుగుపొరుగున ఉండేవని, ఈ ఇరు కుటుంబాల మధ్య గొడవలు సాగుతూ వచ్చాయని పోలీసులు చెబుతున్నారు. 

రామారావు కుటుంబంపై అప్పలరాజు 2018 నుంచి కక్ష పెంచుకున్నట్లు తెలుస్తోంది. తన కూతురితో వివాహేతర సంబంధం కొనసాగించడం సహించలేని అప్పలరాజు ఉద్వేగంతో ఘాతుకానికి పాల్పడినట్లు, ఇది చాలా దురదృష్టకరమని పోలీసులు అన్నారు. విజయ్ మీద గతంలో పెందుర్తి పోలీసు స్టేషన్ లో అప్పలరాజు ఫిర్యాదు చేశాడని, అప్పట్లో విజయ్ ని పోలీసులు అరెస్టు చేశారని చెప్పారు. 

ఈ గొడవల కారణంగానే విజయ్ కుటుంబం నాలుగు నెలల క్రితం రాజమండ్రికి వెళ్లిపోయిందని, ఓ శుభకార్యంలో పాల్గొనడానికి విజయ్ కుటుంబం విశాఖకు వచ్చిందని వారు చెప్పారు. గురువారం తెల్లవారు జామున 4 గంటల సమయంలో హత్య జరిగింది. 

విశాఖపట్నం జిల్లాలో దారుణ సంఘటన జరిగిన విషయం తెలిసిందే. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దారుణ హత్యకు గురయ్యారు. విశాఖపట్నం జిల్లాలోని పెందుర్తి మండలం జుత్తాడ గ్రామంలో ఈ దారుణం జరిగింది. అప్పలరాజు అనే వ్యక్తి ఈ హత్యలకు పాల్పడి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. కుటుంబ కలహాలు ఈ హత్యలకు కారణమై ఉండవచ్చునని భావిస్తున్నారు.

మృతదేహాలు ఇంట్లో రక్తం మడుగులో పడి ఉన్నాయి. ఇంట్లో నిద్రిస్తున్నవారిపై నిందితుడు పదునైన ఆయుధంతో దాడి చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. రెండు కుటుంబాల మభ్య పాతకక్షలు ఈ హత్యలకు కారణం కావచ్చునని కూడా భావిస్తున్నారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు.

click me!