మంత్రి అంబటి రాంబాబుపై అసమమ్మతితో రగిలిపోతున్న సత్తెనపల్లి ప్రజాప్రతినిధులు, వైసిపి నాయకలు రహస్యంగా భేటి అయ్యారు. ఈసారి అంబటికి టికెట్ ఇవ్వొద్దని వైసిపి అదిష్టానాన్ని కోరుతున్నారు.
పల్నాడు : ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నకొద్దీ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే అధికార వైసిపి ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులను ప్రకటిస్తోంది. ఇలాంటి సమయంలో మంత్రి అంబటి రాంబాబుకు సొంత పార్టీ ప్రజాప్రతినిధుల నుండే వ్యతిరేకత ఎదురవుతోంది. మంత్రి వ్యవహారశైలితో విసిగిపోయామని... ఈసారి ఆయనకు సీటు ఇవ్వకూడదని సత్తెనపల్లి వైసిపి నేతలు అదిష్టానాన్ని కోరుతున్నారు.
మంత్రి అంబటిపై అసమమ్మతితో రగిలిపోతున్న సత్తెనపల్లి ప్రజాప్రతినిధులు, వైసిపి నాయకలు రహస్యంగా భేటి అయ్యారు. తమ గోడును పట్టించుకోకుండా మళ్ళీ అంబటి రాంబాబుకే సత్తెనపల్లి టికెట్ ఇస్తే రాజీనామా చేసే యోచనలో స్థానిక ఎంపిటిసి, సర్పంచులు వున్నట్లు సమాచారం. ఈ మేరకు అంబటిని వ్యతిరేకిస్తున్న నాయకులంతా ఓ వర్గంగా ఏర్పడి సత్తెపల్లిలో కొత్తవారికి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. త్వరలోనే పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి అంబటికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయనున్నట్లు అసమ్మతి వర్గం చెబుతోంది.
అంబటి వద్దు - జగనన్న ముద్దు అనే నినాదంతో ముందుకు వెళతామని సత్తెనపల్లి వైసిపి నేతలు చెబుతున్నారు. త్వరలోనే మంత్రికి వ్యతిరేకంగా తమ కార్యాచరణ ప్రకటిస్తామని అంటున్నారు. సత్తెనపల్లిలో వైసిపి గెలవాలంటే అంబటికి కాకుండా వేరేవారికి అవకాశం ఇవ్వాలని అదిష్టానానికి సూచిస్తున్నారు.
Also Read MP Balashowry : వైసీపీకి మరో భారీ షాక్, ఎంపీ బాలశౌరి రాజీనామా..
ఇదిలావుంటే సంక్రాంతి పండగ అంటే తప్పకుండా మంత్రి అంబటి రాంబాబు డ్యాన్స్ గుర్తుకువస్తుంది. ఆయన డ్యాన్స్ ఎంతలా ఫేమస్ అయ్యిందంటే మంత్రి పేరు కాస్త సంబరాల రాంబాబుగా మారిపోయింది. ఇలా నిన్న భోగి సందర్భంగా అంబటి రాంబాబు మరోసారి డ్యాన్స్ తో అదరగొట్టారు. ఇలా ఆయన సంబరాలు చేసుకోవడంపై పెద్దమక్కెన వైసిపి ఎంపిటిసి విజయకుమారి సీరియస్ అయ్యారు. రాంబాబుకు ఇవే చివరి సంబరాలు అంటూ హెచ్చరించారు.
2019 ఎన్నికల సమయంలో వైసిపి గెలుపుకోసం రూ.40 లక్షలు ఖర్చు చేసానని విజయకుమారి తెలిపారు. ఇదే విషయం మంత్రి అంబటికి చెబితే తనకోసం ఖర్చు చేసారా.. వైఎస్ జగన్ కోసం చేసారని అంటున్నాడన్నారు. ఇలా కించపర్చేలా మాట్లాడుతూ... మానసికంగా వేధిస్తున్న అంబటి రాంబాబుకు ఈసారి టికెట్ ఇవ్వొద్దని వైసిపి ఎంపిటిసి విజయకుమారి కోరుతున్నారు.