రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వంలో కూడా మార్పలు జరగటం ఖాయంగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో త్వరలో పూర్తిస్ధాయి ప్రక్షాళన జరుగనున్నట్లు సమాచారం. ఏఐసిసిని పునర్వ్యవస్ధీకరించటంలో భాగంగానే అన్నీ రాష్ట్రాల్లోనూ పార్టీ యంత్రాంగాలను పూర్తిగా మర్చాలని ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహూల్ గాంధి నిర్ణయించుకున్నట్లు తెలిసింది. అందులో భాగంగానే రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వంలో కూడా మార్పలు జరగటం ఖాయంగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన రాష్ట్ర కమిటి పనితీరు ఆశించిన స్ధాయిలో లేదని ఏఐసిసి నాయకత్వం భావిస్తున్నది. అందులో భాగంగానే పార్టీ కమిటీలను పూర్తిగా ప్రక్షాళన చేస్తే గానీ ఉపయోగం లేదని ఏఐసిసి నాయకత్వం అనుకున్నది. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే కమిటీలను ఏర్పాటు చేయాలని నాయకత్వం నిర్ణయించింది.
త్వరలో నియమించనున్న కమిటీల్లో అనుభం, యువరక్తాన్ని మేళవించాలని రాహూల్ నిర్ణయించారు. అందులో భాగంగానే పార్టీలో సీనియర్ నేతగాను, ఏఐసిసి నాయకత్వంతో సన్నిహితంగా ఉండే కేంద్ర మాజీ మంత్రి కిషోర్ చంద్రదేవ్ కు రాష్ట్ర అధ్యక్ష పదవిని అప్పగించాలని కూడా నిర్ణయం అయినట్లు సమాచారం. అదే సమయంలో ఎంఎల్సి సి. రాయచంద్రయ్య పేరు కూడా పరిశీనలో ఉన్నట్లు సమాచారం.
అదే విధంగా, విశాఖపట్నంకు చెందిన బొలిశెట్టి సత్యనారాయణను వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించాలని కూడా దాదాపు నిర్ణయం జరిగినట్లు సమాచారం. అదే విధంగా, రాష్ట్రం మొత్తంలోని 13 జిల్లాలకు చెందిన సీనియర్లతో పాటు యువనేతలను పార్టీ కమిటీల్లో నియమించేందుకు కసరత్తు కూడా మొదలైంది.
అన్నీ పరిస్ధితులు అనుకూలిస్తే రాహూల్ గాంధి భావిస్తున్నట్లుగా వచ్చే మార్చి నెలాఖరులోగా నూతన కమిటీ ఏర్పాటవటం ఖాయమని సమాచారం.