రఘురామ విచారణ: పుట్టిన రోజున హైదరాబాద్ వచ్చి ఏపీ సిఐడీకి చిక్కి...

By telugu teamFirst Published May 15, 2021, 7:22 AM IST
Highlights

నిన్న అరెస్టయిన వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణమ రాజును నేడు కూడా సీఐడి అధికారులు ప్రశ్నించనున్నారు. ఆయనను సిఐడి అధికారులు నిన్న అర్థరాత్రి ఒంటి గంట వరకు ప్రశ్నించారు.

అమరావతి: పుట్టిన రోజును కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవాలని ఆశపడి హైదరాబాదు వచ్చిన వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణమ రాజును ఏపీ సీఐడి పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీ నుంచి హైదరాబాదు రావడం ద్వారా అరెస్టుకు ఆయన అవకాశం కల్పించారు. ఆయన ఢిల్లీలోనే మకాం వేసి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద, ఆయన ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. 

రఘురామకృష్ణమ రాజును సీఐడది పోలీసులు శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట వరకు ప్రశ్నించారు. సిఐడీ ఏడీజీ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో విచారణ జరిగింది. గుంటూరులోని తమ కార్యాలయంలో రఘురామకృష్ణమ రాజును ప్రశ్నించారు. 

Also Read: గుంటూరు: సీఐడీ కార్యాలయానికి రఘురామకృష్ణంరాజు

సామాజిక వర్గాల మధ్య విద్వేషం సృష్టించే విధంగా రఘురామకృష్ణమ రాజు ఎందుకు వ్యాఖ్యలు చేశారనే విషయాన్ని రాబట్టడానికి సిఐడి అధికారులు ప్రయత్నిస్తున్నారు. రఘురామకృష్ణమ రాజు వెనక ఎవరున్నారనే కోణంలో కూడా సిఐడి అధికారులు విచారణ జరుపుతున్నారు. 

తొలుత రఘురామకృష్ణమ రాజుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎవరి ప్రోద్బలంతో పదవుల్లో ఉన్న వ్యక్తులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని సిఐడి అధికారులు ఆయనను ప్రశ్నించారు. రఘురామకృష్ణమ రాజు వాంగ్మూలాన్ని సిఐడి అధికారులు రికార్డు చేశారు. 

కాగా, సీఐడి బృందాలు రెండు ఇంకా హైదరాబాదులోనే మకాం వేశాయి. రఘురామకృష్ణమ రాజుకు సాంకేతిక సహాయం అందించినవారిపై ఆ బృందాలు దృష్టి పెట్టాయి. రఘురామకృష్ణమ రాజును శుక్రవారం సాయంత్రం హైదరాబాదులో ఏపీ సీఐడి పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

Also Read: రఘురామ అరెస్ట్ వెనుక కారణమిదే: ఏపీ సీఐడీ ప్రకటన

కాగా, రఘురామకృష్ణమ రాజు అరెస్టును సవాల్ చేస్తూ దాఖలైన హౌస్ మోషన్ పిటిషన్ మీద ఈ రోజు కోర్టులో విచారణ జరగనుంది. ఈ విచారణ పూర్తయ్యే వరకు రఘురామకృష్ణమ రాజును రిమాండ్ కు తరలించవద్దని కోర్టు సిఐడిని ఆదేశించింది. 

click me!