జగన్ ను తిట్టలేక కాదు, వాళ్ల ఆడపడుచులు గుర్తొస్తారు: పవన్

First Published Aug 3, 2018, 6:51 AM IST
Highlights

వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. 

హైదరాబాద్‌: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. "జగన్మోహన్‌రెడ్డి నన్ను తిడుతుంటే భరించింది తిరిగి తిట్టలేక కాదు. నేనూ బలంగా తిట్టగలను. వాళ్ల కుటుంబసభ్యులు, ఆడపడుచులు నాకు గుర్తుకొస్తారు. అలా బాధ్యతారాహిత్యంగా మాట్లాడలేను" అని ఆయన అన్నారు. 

రాత్రివేళ షూటింగులకు హాజరయ్యే ఆడపిల్లలు తిరిగి ఇళ్లకు వెళ్లేందుకు స్వయంగా వాహనాలు ఏర్పాటు చేసేవాడినని తెలిపారు. జనసేన మహిళా విభాగాన్ని పెంచకపోవడానికి కారణం ఉందని, మహిళలకు కోపం ఎక్కువ అని, ఠక్కున ఒక మాట అనేయవచ్చునని, అది ఇళ్లలో అయితే సరిపోతుంది గానీ రాజకీయాలకు వచ్చేసరికి కుదరదని అన్నారు.

మహిళలను రోడ్లపై కూర్చోపెట్టి ఇతరులను తిట్టించే రాజకీయాలు వద్దని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఆలోచించేవాళ్లు, పోరాటం చేసే వాళ్లు తమ పార్టీకి అవసరమని మహిళలు కాళీ, దుర్గామాతల్లా ఉండాలని, సరస్వతిలా చదువుచెప్పి జ్ఞానాన్ని పంచే వాళ్లు పార్టీకి కావాలని అన్నారు. 

అలా అంటూ, మహిళలను రోడ్లపై కూర్చోపెట్టి ఇతరులను తిట్టించే రాజకీయాలు వద్దని చెప్పారు. చదువు, జ్ఞానం, సహనం ఉన్నవాళ్లు, అవమానాలను భరించి ముందుకు నడిచే వాళ్లు తన పార్టీకి అవసరమని అన్నారు. 

గురువారం హైదరాబాదులోని మాదాపూర్‌లో గల జనసేన కార్యాలయంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వీరమహిళ కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు.
 
మహిళలు ఎలా తయారవ్వాలనేది వాళ్ల చాయిస్‌ అని, దానికి విపరీతార్థాలు తీయకూడదని చెప్పారు. తాను కొన్ని వదిలేసుకుని రాజకీయాల్లోకి వచ్చానని, రెండు పడవల ప్రయాణం చేయడం సరికాదని భావించానని అన్నారు.

click me!