ఏపీలో నిరుద్యోగ భృతిని ప్రతి నెలా నిరుద్యోగుల ఖాతాల్లో జమ చేస్తామని ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ప్రతి నెలా వెయ్యి రూపాయాల చొప్పున బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్టు చెప్పారు.
అమరావతి: ఏపీలో నిరుద్యోగ భృతిని ప్రతి నెలా నిరుద్యోగుల ఖాతాల్లో జమ చేస్తామని ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ప్రతి నెలా వెయ్యి రూపాయాల చొప్పున బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్టు చెప్పారు.
గురువారం నాడు ఏపీ కేబినెట్ సమావేశంలో తర్వాత కేబినెట్ సమావేశం వివరాలను మంత్రి లోకేష్ వివరించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హమీ మేరకు ఈ పథకాన్ని అమలు చేయనున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో సుమారు 64 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని ఆయన చెప్పారు. నిరుద్యోగ భృతికి ముఖ్యమంత్రి యువ నేస్తం అనే పేరును ఖరారు చేసినట్టు ఆయన చెప్పారు.
ప్రతి నెలా నిరుద్యోగుల బ్యాంకు ఖాతాల్లో వెయ్యి రూపాయాలను నేరుగా జమ చేయనున్నట్టు ఆయన చెప్పారు. నిరుద్యోగ భృతిని అమలు చేయడం వల్ల రాష్ట్ర ఖజానాపై ప్రతి నెలా రూ.640 కోట్ల భారం పడుతోందన్నారు.
ఇప్పటికే వెబ్సైట్ను అందుబాటులోకి తెచ్చినట్టు లోకేష్ చెప్పారు.ఈ వెబ్సైట్లో నిరుద్యోగుల నుండి సమాచారాన్ని అప్లోడ్ చేయాలని కోరనున్నట్టు చెప్పారు.ఆగష్టు 15వ తేదీ నుండి ధరఖాస్తుల స్వీకరణ ప్రారంభించాలని భావిస్తున్నట్టు చెప్పారు.
22 నుండి 35 ఏళ్ల లోపు నిరుద్యోగ యువత ఈ పథకం కింద ధరఖాస్తు చేసుకొనేందుకు అర్హులని ఆయన చెప్పారు. ధరఖాస్తు చేసుకొనే సమయంలోనే అర్హులు కాకపోతే ఎందుకు ఈ పథకం కింద అర్హులు కాలేదో కూడ నిరుద్యోగ యువతకు వివరించనున్నట్టు ఆయన తెలిపారు.
రాష్ట్రంలో రెవిన్యూలోటు ఉన్నప్పటికీ కూడ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హమీ మేరకు నిరుద్యోగ భృతిని అమలు చేస్తున్నట్టు ఆయన చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక కంపెనీలు ముందుకు వస్తున్నాయని ఆయన గుర్తు చేశారు. మరో వైపు నిరుద్యోగ యువతకు నైపుణ్యశిక్షణను ఇవ్వనున్నట్టు లోకేష్ చెప్పారు. నిరుద్యోగ భృతికి, నైపుణ్య శిక్షణకు సంబంధం లేదన్నారు.
ఈ వార్తను చదవండి:నిరుద్యోగభృతికి ఏపీ కేబినెట్ ఆమోదం: ఆగష్టు 15 నుండి ధరఖాస్తుల స్వీకరణ