
Pawan Kalyan : కాశ్మీర్ అందాలను చూసేందుకు వెళ్లిన పర్యాటకులను ఉగ్రమూకలు పొట్టనపెట్టుకున్నాయి. అనంత్ నాగ్ జిల్లా పహల్గాం పరిధిలోని బైసరన్ వ్యాలీలో అమాయక టూరిస్ట్ లను ఉగ్రవాదులు అతి కిరాతకంగా హతమార్చారు. ఈ కాల్పుల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన 25 మంది, నేపాల్ కు చెందిన మరో వ్యక్తి చనిపోయారు. ఇలా తుపాకీ తూటాలకు బలయినవారిలో ఆంధ్ర ప్రదేశ్ కు చెందినవారు కూడా ఇద్దరు ఉన్నారు.
నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ రావు, విశాఖవాసి చంద్రమౌళి పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయారు. కుటుంబసభ్యులను కోల్పోయి పుట్టెడు దు:ఖంలో ఉన్న కుటుంబాలను ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పరామర్శించారు. ఇద్దరి మృతదేహాలకు నివాళి అర్పించిన ఆయన కుటుంబసభ్యులను ఓదార్చారు.
ముందుగా కావలికి వెళ్లిన పవన్ కల్యాణ్ మధుసూదన్ రావు మృతదేహానికి పూలమల వేసి నివాళి అర్పించారు. మృతదేహంవద్ద విలపిస్తున్న కుటుంబసభ్యులను ఓదార్చారు. ఇంటిపెద్దను కోల్పోయిన ఈ కుటుంబానికి అండగా ఉంటామని... ప్రభుత్వం అన్నివిధాలుగా సహాయపడుతుందని పవన్ భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా ఉగ్రవాదులు కేవలం హిందువలనే టార్గెట్ చేసి చంపడం దారుణమని పవన్ అన్నారు. ఏ మతానికి చెందినవారో తెలుసుకుని మరీ చంపడమేంటని... ఇదెక్కడి మతపిచ్చి అంటూ మండిపడ్డారు. జమ్మూ కాశ్మీర్ అభివ్రుద్దిని చూసి ఓర్వలేక ఇలాంటి దుశ్చర్యకు పాల్పడ్డారని... ఈ దారుణానికి పాల్పడ్డవారు ఎక్కడ దాక్కున్న వదిలిపెట్టకూడదని అన్నారు. ఉగ్రవాదులను ఏరిపారేయాలని పవన్ అన్నారు.
ఇక గురువారం సాయంత్రం కశ్మీర్ లో ఉగ్రమూకల చేతిలో ప్రాణాలు కోల్పోయిన విశాఖవాసి చంద్రమౌళికి పవన్ కల్యాణ్ నివాళి అర్పించారు. విశాఖలోని చంద్రమౌళి ఇంటికివెళ్లిన ఆయన మృతదేహానికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా బోరున విలపిస్తున్న బాధిత కుటుంబాన్ని పవన్ ఓదార్చారు. వారి వేదనను చూసి పవన్ కల్యాణ్ కూడా ఎమోషనల్ అయ్యారు.