గోదావరి నదిలో మునిగిన లాంచీని నేవీ సిబ్బంది గుర్తించారు. నదిలో 60 అడుగుల లోతులో లాంచీ ఉన్నట్లు గుర్తించారు.
కాకినాడ: గోదావరి నదిలో మునిగిన లాంచీని నేవీ సిబ్బంది గుర్తించారు. నదిలో 60 అడుగుల లోతులో లాంచీ ఉన్నట్లు గుర్తించారు. భారీ క్రేన్ల సాయంతో బోటును తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మృతదేహాలు దొరికితే పోస్టుమార్టం చేసేందుకు పోలవరం వద్ద ఏర్పాటు చేశారు.
గాలింపు, సహాయక చర్యలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. అన్ని ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశించారు. మృతదేహాల వెలికితీత, పోస్టుమార్టం వేగంగా జరిగేలా చూడాలని సూచించారు. కాసేపట్లో ఆయన సంఘటనా స్థలానికి చేరుకుంటారు. హోం మంత్రి చినరాజప్ప ప్రమాద స్థలానికి బయలుదేరారు.
బోటు ప్రమాదంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
పశ్చిమ గోదావరి జిల్లాలోని మంటూరు వద్ద గోదావరి నదిలో లాంచీ మునిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో దాదాపు 30 మంది గల్లంతైనట్లు భావిస్తున్నారు. అయితే ఎంతమంది గల్లంతయ్యారనేది స్పష్టంగా తెలియడం లేదు. ప్రమాదసమయంలో లాంచీలో 30 మంది ఉంటారని సమాచారం ఉందని చినరాజప్ప చెప్పారు. అలాగే సంఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తామని అన్నారు.