ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఏపీ పాలన విశాఖపట్నం నుండి ప్రారంభంకానుందని టిటిడి ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు.
విశాఖపట్నం : ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. మరోసారి విజయమే లక్ష్యంగా అధికార వైసిపి కీలక నిర్ణయాలను అమలుచేస్తోంది. ఇప్పటికే మూడు రాజధానుల ప్రకటన చేసిన వైసిపి ప్రభుత్వం ఇక పాలనను విశాఖ నుండే సాగించే ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికలకు ముందే విశాఖకు రాజధానిని తరలించాలని ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే వచ్చే నెల ఆగస్ట్ లో లేదంటే ఆ తర్వాతి నెల సెప్టెంబర్ లో సీఎం జగన్ విశాఖ నుండే కార్యకలాపాలు సాగించనున్నట్లు టిటిడి ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. సీఎం క్యాంప్ ఆఫీస్ విశాఖకు తరలించే ప్రక్రియ ప్రారంభమయ్యిందని టిటిడి ఛైర్మన్ వెల్లడించారు.
గతంలో స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖపట్నం నుండి పాలన సాగించేందుకు సిద్దపడగా న్యాయ పరమైన అడ్డంకులు వచ్చాయని వైవి సుబ్బారెడ్డి తెలిపారు. అందువల్లే విశాఖనుండి ఎప్పుడో ప్రారంభం కావాల్సిన పరిపాలన కార్యకలాపాలు కాస్త ఆలస్యంగా ప్రారంభమవుతున్నాయని అన్నారు. వచ్చే నెలలో జగన్ విశాఖకు షిప్ట్ కానున్నారని... సీఎం క్యాంప్ కార్యాలయం నుండే పాలన సాగించనున్నారంటూ వైవి సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు.
Read More అందరి చూపు ఆ మీటింగ్ పైనే: నేడు పిల్లి వర్గీయుల బీసీ మీటింగ్, హాజరు కానున్న మల్లాడి
ఇప్పటికే స్వయంగా సీఎం జగన్ అంతర్జాతీయ స్థాయి వేదికలపై తాను విశాఖకు షిప్ట్ అవుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దేశ రాజధాని న్యూడిల్లీలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సన్నాహక సమావేశంలో సీఎం జగన్ పాల్గొని జాతీయ, అంతర్జాతీయ స్థాయి వ్యాపారవేత్తలను ఏపీలో మరీముఖ్యంగా అన్ని సౌకర్యాలు గల విశాఖలో పెట్టుబడులు పెట్టాలని సూచించారు. త్వరలోనే రాజధాని విశాఖ నుండే ప్రభుత్వ కార్యకలాపాలు సాగనున్నాయని... తానుకూడా కుటుంబసమేతంగా అక్కడికి షిప్ట్ కానున్నట్లు ముఖ్యమంత్రి జగన్ తెలిపారు.
ఇక పలువురు మంత్రులు, వైసిపి ప్రజాప్రతినిధులు మూడు రాజధానుల నిర్ణయానికే ప్రభుత్వం కట్టుబడి వుందని స్ఫష్టం చేస్తున్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ అయితే ఇటీవల విశాఖకు రాజధాని వచ్చేసింది... మనుషులే రావాల్సి వుందన్నారు. ఆయన అన్నట్లుగానే త్వరలో విశాఖకు సీఎం జగన్ షిప్ట్ కానున్నట్లు వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలు తెలియజేస్తున్నాయి.
మంత్రులు అమర్నాథ్, కారుమూరి నాగేశ్వరరావు సైతం విశాఖలోనే సీఎం జగన్ కాపురం పెట్టనున్నట్లు తెలిపారు. త్వరలోనే విశాఖపట్నం నుంచి పాలన సాగబోతుందని...మూడు రాజధాను విషయంలో ప్రభుత్వం వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని మంత్రి అమర్నాథ్ స్పష్టం చేసారు. అనుకున్న సమయానికి లేదంటే అంతకంటే ముందే సీఎం విశాఖకు వస్తారన్నారు. సీఎం రాకకోసం విశాఖవాసులే కాదు ఉత్తరాంధ్ర ప్రజలు ఎదురుచూస్తున్నారని... వారి కోరిక త్వరలోనే తీరనుందని మంత్రి అమర్నాథ్ తెలిపారు.