కోటం రెడ్డి ఈ మధ్య గాంధీగిరి ఆయుధం చేసుకున్నారు. ప్రజాసమస్యలను పరిష్కరించేందుకు, అధికారులను దారికి తెచ్చేందుకు గాంధీగిరి చేసి సక్సెస్ అయ్యారు. ఇపుడు, నెల్లూరు కాలువ గట్ల మీద ఉన్న ఇళ్లను ఆక్రమణ పేరుతో పీకేయాలనుకుంటున్నారు అధికారులు. 50 యేళ్ల నాటి ఈ ఇళ్లను ప్రత్యామ్నాయం చూపకుండా పెరికేస్తే, మునిసిపల్ మంత్రి ఇంటి ఎదుటే గాంధీ గిరి చేస్తానని హెచ్చరించారు.
నెల్లూరులో నీటిపారుదల కాలువల పక్కన ఎప్పటినుంచో ఉన్న ఇళ్లను ఇపుడు అధికారులు అక్రమణ బ్రాండ్ వేయడానికి రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ అంగీకరించడం లేదు.అక్రమణ పేరుతో వాళ్లని అక్కడి నుంచి తరిమేయాలనుకుంటే తీవ్రపరిణామాలుంటాయని ఆయన ఈరోజు హెచ్చరించారు.
ఈ పేద ఇళ్ల తొలగింపు ప్రక్రియ న్యాయబద్ధంగా లేకపోతే మంత్రి నారాయణ ఎదుటే నిరసన ధర్నాకు దిగుతానని హెచ్చరించారు.
నియోజకవర్గం 31 వ డివిజన్ పరిధిలోని చాణక్యపురిలో ఆయన శనివారం నాడు రోజు ప్రజాబాట కార్యక్రమం నిర్వహించారు. స్థానికులతో మాట్లాడి సమస్యల గురించి తెలుసుకున్నారు. ఈ ప్రాంతంలో నీటిపారదుల కాలువల దగ్గిర నివసించే వారిని ఖాళీ చేయించే విషయంలో మానవతా దృక్పథం ప్రదర్శించాలని ఆయన అధికారులకు సూచించారు. నీటిపారుదలకు ఇబ్బంది లేకుండా కొన్ని వేల కుటుంబాలుదాదాపు 50 సంవత్సరాలుగా కాపురాలుంటున్నాయని, వారి నివాసాలకు కరెంటు కనెక్షన్,నీటికనెక్షన్ కూడా ప్రభుత్వమే ఇచ్చిందని చెప్పారు. వారినుంచి పన్నులు కూడా వసూలుచేసుకున్నారని, ఇపుడు ‘ఆక్రమణ’ అనడం సరికాదని శ్రీధర్ రెడ్డి చెప్పారు.
కాలువ గట్ల మీద వేసుకున్నఈ ఇళ్ల తో నీటిపారుదల కాలువల నిర్వహణకు ఎలాంటి ఇబ్బంది వస్తున్నదో తెలపాలని కూడా ఆయన అడిగారు. దశబ్దాల నివాసం తర్వాత ఇపుడు ఈ ఇళ్లన్నీ ఆక్రమణలు ఎలా అవుతాయని చెబుతూ వాటిని తొలగిస్తే తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని ఆయన చెప్పారు.
ఒక వేళనిజంగానే ఈ నివాసాలు నీటిపారుదల కు అడ్డమయితే, వారందరికి ప్రత్యామ్నాయం చూపించిన తర్వాతే ఖాళీ చేయించాలని ఆయన స్పష్టం చేశారు.
కాలువల పూడిక తీత మీద అవగాహన లేకుండా పేదల జీవితాలను నాశనం చేసే ప్రయత్నాలు సాగిస్తే మునిసిపల్ మంత్రి క్యాంప్ ఆఫీస్ ముందు గాంధీగిరి చేస్తానని ఆయన హెచ్చరించారు. పేదల జీవితాలను నాశనం చేయాలని ఎవరూ ప్రయత్నించినా ప్రత్యక్ష చర్యలు తీప్పవని హెచ్చరించారు.