వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేపట్టిన పల్లా దీక్షను పోలీసులు భగ్నం చేయడంపై మాజీ మంత్రి, టిడిపి జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేష్ స్పందిస్తూ వైసిపి ప్రభుత్వం, సీఎం జగన్ పై మండిపడ్డారు.
గుంటూరు: విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించాలన్న కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గత ఐదురోజులుగా టిడిపి నాయకులు పల్లా శ్రీనివాస్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షని ఇవాళ తెల్లవారుజామున భగ్నం చేసిన పోలీసులు పల్లాను బలవంతంగా హాస్పిటల్ కు తరలించారు. ఈ ఘటనపై మాజీ మంత్రి, టిడిపి జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేష్ స్పందిస్తూ వైసిపి ప్రభుత్వం, సీఎం జగన్ పై మండిపడ్డారు.
''సీఎం వైఎస్ జగన్ గారు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణని అడ్డుకోరు, ప్రతిపక్ష పార్టీలు పోరాడితే ఊరుకోరు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కంటూ ఏడు రోజులుగా ఉద్యమిస్తున్న పల్లా శ్రీనివాస్ గారి ఆమరణ నిరాహార దీక్షని వైకాపా ప్రభుత్వం కుట్రపూరితంగా భగ్నం చెయ్యాలని ప్రయత్నించడం దారుణం. విశాఖ ఉక్కు కాపాడుకోవడానికి ప్రాణత్యాగానికైనా సిద్ధం దీక్ష విరమించేది లేదంటూ ఉద్యమానికి ఊపిరిపోస్తున్న పల్లా గారి పోరాటం స్ఫూర్తిదాయకం'' అంటూ పల్లా వీడియోను జతచేస్తూ లోకేష్ ట్వీట్ చేశారు.
వీడియో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమంపై ఉక్కుపాదం... రాత్రికి రాత్రే పల్లా దీక్ష భగ్నం
విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించాలన్ని కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గత ఆరు రోజులుగా పల్లా ఆమరణ దీక్ష చేస్తున్నారు. కాగా ఈ రోజు(మంగళవారం) పల్లా దీక్షకు సంఘీభావం తెలిపేందుకు టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖకు వెళ్లడానికి సిద్దమయ్యారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు పర్యటనకు ముందే పోలీసులు ఈ దీక్షను భగ్నం చేశారు.
పిబ్రవరి 10వ తేదీ నుండి మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు దీక్ష చేస్తున్నారు. ఈ ఆమరణ నిరాహార దీక్షకు విశాఖ ప్రజలనుండి, టీడీపీ శ్రేణుల నుండి పెద్దఎత్తున మద్దతు లభించింది. పల్లా మద్దతు తెలిపేందుకు అమరావతి రైతులు సైతం విశాఖకు వచ్చారు.