అధినేతల ‘నంద్యాల’ యుద్ధం మొదలైంది

Published : Jun 25, 2017, 04:17 PM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
అధినేతల ‘నంద్యాల’ యుద్ధం మొదలైంది

సారాంశం

మామూలుగా అయితే, ఓ ఉపఎన్నికను ఇంతస్ధాయిలో చూడక్కర్లేదు. కానీ నంద్యాలలో గెలవటం ఇపుడు రెండు పార్టీలకు ప్రతిష్టాత్మకమైపోయింది. అందులోనూ చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి ఉపఎన్నిక కాబట్టే అంతలా వేడి రాజుకుంటోంది.

చంద్రబాబునాయుడు-వైఎస్ జగన్మోహన్ రెడ్డి మధ్య నంద్యాల యుద్ధం మొదలైంది. నంద్యాల ఉపఎన్నిక అంటే ఇద్దరు అధినేతల మధ్య యుద్ధమే కదా? పేరుకు మాత్రమే రెండు పార్టీల తరపున అభ్యర్ధులు పోటీ పడుతారు. అసలు యుద్ధమంతా అధినేతల మధ్యనే. మామూలుగా అయితే, ఓ ఉపఎన్నికను ఇంతస్ధాయిలో చూడక్కర్లేదు. కానీ నంద్యాలలో గెలవటం ఇపుడు రెండు పార్టీలకు ప్రతిష్టాత్మకమైపోయింది. అందులోనూ చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి ఉపఎన్నిక కాబట్టే అంతలా వేడి రాజుకుంటోంది.

అధికార-ప్రతిపక్షాలు రెండూ తమ అభ్యర్ధులను ప్రకటించేయటంతో నియోజకవర్గంలోనే కాకుండా జిల్లా అంతటా ఒక్కసారిగా ఎన్నికల వేడి రాజుకుంది. కొద్ది రోజులుగా రాష్ట్ర రాజకీయం మొత్తం నంద్యాల చుట్టూనే తిరుగుతోందనటంలో ఎవరికీ సందేహం అక్కర్లేదు. మామూలుగా అయితే, ఒక ఉపఎన్నిక విషయంలో అంతటి ఆసక్తి అవసరం లేదు. కానీ నంద్యాల విషయం గురించి ప్రత్యేకంగా చెప్పకనర్లేదు. అందుకే జనాలంతా అంతటి ఆసక్తిని కనబరుస్తున్నారు.

టిడిపి తరపున భూమా బ్రహ్మానందరెడ్డిని చంద్రబాబునాయుడు ఇప్పటికే ప్రకటించగా ఆదివారం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా శిల్సా మోహన్ రెడ్డి అభ్యర్ధిత్వాన్ని ప్రకటించారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకే శిల్పా టిడిపి నుండి వైసీపీలోకి వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఎప్పుడైతే శిల్పా వైసీపీలో చేరారో నియోజకవర్గంలో టిడిపి దాదాపు ఖాళీ అయిపోయింది.

ఎప్పుడైతే శిల్పా వైసీపీలో చేరటం ఖాయమైపోయిందో ఆయనతో పాటు నంద్యాల మున్సిపల్ కౌన్సిలర్లు, జడ్పీటీసీ, ఎంపిటీసీలు, సర్పంచులతో పాటు మండల, గ్రామస్ధాయి నేతలు సుమారు 2 వేల మంది వైసీపీలో చేరిపోయారు. దాంతో చంద్రబాబు ఖంగుతున్నారు. దానికితోడు అప్పటికే పార్టీ గెలుపు అవకాశాలపై చంద్రబాబు అనేకమార్లు సర్వేలు కూడా చేయించారు. అన్నింటిలోనూ వ్యతిరేక ఫలితమే రావటం కూడా చంద్రబాబు ఇబ్బందులకు కారణమైంది.

ఉపఎన్నిక నిర్వహణకు ఎన్నికల కమీషన్ షెడ్యూల్ ప్రకటించటమే ఆలస్యమన్నట్లుగా ఉంది పరిస్ధితి. ఒకవైపు అభ్యర్ధిని ప్రకటించిన చంద్రబాబు తాజాగా ఎన్నికను ఏకగ్రీవం చేద్దామని చెప్పి నేతలందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. మొన్ననే నంద్యాలలో పర్యటించిన చంద్రబాబు ఏకగ్రీవ ప్రతిపాదన చేయటంతోనే ఉపఎన్నికలో గెలుపుపై చంద్రబాబు ఆశలు వదిలేసుకున్నారంటూ ప్రచారం మొదలైపోయింది. అయితే, అభ్యర్ధిగా శిల్పా ను ప్రకటించటంతో నంద్యాలను ఏకగ్రీవంగా టిడిపికి కట్టబెట్టేందుకు జగన్ అంగీకరించటం లేదన్నవిషయం స్పష్టమైపోయింది.

 

PREV
click me!

Recommended Stories

Weather Update: ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ.. మరోవైపు 42 డిగ్రీల ఎండలు !
ప్రధాన మంత్రి మోదీకి సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు | CM Chandrababu Naidu at NDA 12 Years Event