ఊపందుకోనున్న ‘నంద్యాల’

First Published Jul 27, 2017, 5:23 PM IST
Highlights
  • ఉపఎన్నికలో గెలుపును టిడిపి, వైసీపీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే.
  • ఇప్పటికే నియోజకవర్గంలో ఎన్నికల జ్వరం దాదాపు పీక్ స్టేజ్ కు చేరుకుంది.
  • జగన్ ఈనెలాఖరుకు నంద్యాలలో పర్యటించే అవకాశం ఉంది.

షెడ్యూల్ విడుదలవ్వటంతో నంద్యాల ఉపఎన్నిక ఊపందుకోనున్నది. ఇంతకాలం అధికార టిడిపి, ప్రతిపక్ష వైసీపీలు రెండూ ఎన్నిక షెడ్యూల్ కోసమే ఎదురుచూస్తున్నాయి. సరే ఇతర పార్టీలు కూడా రంగంలో ఉన్నాయనుకోండి అది వేరే సంగతి. ఆగస్టు 23వ తేదీన నంద్యాల ఉపఎన్నిక తేదీని ప్రకటించిన ఎన్నకల కమీషన్ అందుకు సంబంధించిన నోటిఫికేషన్ ఈనెల 29వ తేదీ ప్రకటించనున్నట్లు చెప్పింది.

భూమా మరణంతో అనివార్యమైన ఉపఎన్నిక ఎన్నికలో గెలుపును టిడిపి, వైసీపీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నియోజకవర్గంలో ఎన్నికల జ్వరం దాదాపు పీక్ స్టేజ్ కు చేరుకుంది. అందుకనే చంద్రబాబునాయుడు ఇప్పటికే రెండుసార్లు నియోజకవర్గంలో పర్యటించారు. టిడిపి అభ్యర్ది భూమా బ్రహ్మానందరెడ్డి గెలుపు కోసం అనేక వరాలు ప్రకటించేసారు. ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చన్న ఉద్దేశ్యంతోనే చంద్రబాబు ఇప్పటికే సామాజికవర్గాల వారీగా తాయిలాలూ ప్రకటించేసారు.

జిల్లా నేతలకు అదనంగా భూమా గెలుపు కోసం చంద్రబాబు డజనుమంది మంత్రులు, 25 మంది ఎంఎల్ఏలు, 5 గురు ఎంఎల్సీలను రంగంలోకి దింపిన సంగతి అందరూ చూస్తున్నదే. అయితే, వైసీపీ తరపున అభ్యర్ధి శిల్పా మోహన్ రెడ్డి కాకుండా పలువురు ఎంఎల్ఏలు మాత్రమే ప్రచారంలో పాల్గొన్నారు. జగన్ ఈనెలాఖరుకు నంద్యాలలో పర్యటించే అవకాశం ఉంది. భారీ ఎత్తున రోడ్డుషో తో పాటు డోర్ టు డోర్ ప్రచారానికి జగన్ ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నట్లు లోటస్ పాండ్ వర్గాలు చెబుతున్నాయి.

click me!