
అమరావతిలో ఇంతవరకు మనం చూసినవన్నీ గాలి మేడలే...
ఇపుడు వాటిని చల్ల గాలి మేడలుగా మార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నారు. బయట ఉన్న టెంపరేచర్ కంటే, ఈ గాలిమేడల్లో టెంపరేచర్ మూడు నాలుగు డిగ్రీలు తక్కువ ఉంటే ఇవి చల్లగాలి మేడలవుతాయని ఆయన భావిస్తున్నారు.
అమరావతి అంటే అడ్మినిస్ట్రేషనే కాదు, కూలింగ్ సిస్టమ్ కూడా నట.
చుట్టూ ఉన్న పచ్చని పొలాలు, చెట్లు పుట్టలు, అడవులు నరికేసి కడుతున్న వరల్డ్ క్లాస్ సిటిని చల్లబరిచే మార్గం చూడమని అమరావతిని డిజైన్ వేస్తున్న బ్రిటిష్ ఆర్కిటెక్ట్ నార్మన్ ఫోస్టర్ ను ముఖ్యమంత్రి అడిగారు.
మామూలుగానే విజయవాడ గుంటూరు ప్రాంతం వేసవిలో నిప్పులకొలిమిలాగా ఉంటుంది. వేసవిలో టెంపరేచర్ 46 దాకా వస్తూ ఉంటుంది. ఇక్కడ బాబు గారి కాంక్రీట్ నిర్మాణాలన్నీ వస్తే , టెంపరేచర్ పెరుగుతుంది. అసలే ఆంధ్ర తెలంగాణాలలో ఎండలు మండుతాయని ప్రతిసంవత్సరం వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది. ఈ ఏడాది 47 డిగ్రీల సెల్సియస్ దాక ఎండలు మండుతాయని నిన్ననే వాతావరణ శాఖ వారు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అమరావతి అంటే ప్రజలు హడలిపోకుండా ఉండేందుకు ఇక్కడి భవనాల్లో టెంపరేచర్ బయటికంటే ఎపుడూ మూడు నాలుగు డిగ్రీలు తక్కువ ఉండి, చల్లగా వుండేలా చూడా లని ముఖ్యమంత్రి చూస్తున్నారు.
అందువల్ల అమరావతి మేడలన్నీ శీతలమేడల్లా ఉండేలా డిజైన్ చేయాలని, దీనితో పాటు ఊరంతా పచ్చికబయళ్లు ఉండేలా చూడాలని ఆయన నార్మన్ ఫోస్టర్ కంపెనీకి ప్రత్యేకంగా ఆయన విజ్ఞప్తి చేశారని అధికారులు చెప్పారు.