
ప్రపంచస్థాయి రాజధాని నిర్మిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో మానవ వనరుల శిక్షణ కూడా ప్రపంచ స్థాయిలోనే ఉండాలని భావిస్తున్నారు. రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి సంస్థకు రాష్ట్ర స్థాయిలోనే కాకుండా మూడు ప్రాంతాలలో ప్రాంతీయ అకాడమీలు అవసరమని, కిందిస్థాయిలో జిల్లాకు ఒకటి చొప్పున జిల్లా స్థాయి మానవ వనరుల శిక్షణా సంస్థలను ఏర్పాటుచేయాలని ఆయన నిర్ణయించారు.
గురువారం మధ్యాహ్నం ఉండవల్లిలో ఏపీ మానవ వనరుల అభివృద్ది సంస్థ డైరెక్టర్ జనరల్ డి. చక్రపాణి తో ఆయన ఈ విషయాలు చర్చించారు.
ప్రపంచశ్రేణి శిక్షణ విధానాలను రాష్ట్ర అధికారులకు పరిచయం చేయాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా హెచ్ఆర్డీ సంస్థ డైరక్టర్ జనరల్కు సూచించారు.
ఉమ్మడి రాష్ట్ర విభజన తరువాత హైదరాబాద్లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థకు ప్రత్యామ్నాయంగా సొంత గడ్డపై మరో శిక్షణా సంస్థను ఏర్పాటుచేసుకోవాల్సివస్తున్నది. అయితే, రాష్ట్రస్థాయిలోనే కాకుండా స్థానిక అవసరాలకు తగినట్టుగా ఎక్కడికక్కడే శిక్షణ సంస్థలను ఏర్పాటుచేసుకుని మానవ వనరులను అభివృద్ధి చేసుకోవాలని ముఖ్యమంత్రి ప్రతిపాదిస్తున్నారు.
దానికి తగినట్టుగా కోస్తా, రాయలసీమ, ఉత్తరాంధ్రలలో మూడు ప్రాంతీయ సంస్థలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీటిని విశాఖ, బాపట్ల, తిరుపతి నగరాలలో ప్రారంభిస్తారు. ఇవిగాక జిల్లాకు ఒకటి చొప్పున జిల్లా స్థాయి మానవ వనరుల శిక్షణ సంస్థలు ఏర్పాటు అవుతాయి. ఇవి జిల్లా స్థాయిలో మానవ వనరుల శిక్షణ అవసరాలను తీర్చేలా కార్యక్రమాలను రూపొందించుకుంటాయి.
రాష్ట్రస్థాయిలో ఏర్పాటుచేసే హెచ్ఆర్డీ సంస్థను చక్కటి వాతావరణం, వనరులు, భవనాలు, ఇతర మౌలిక సదుపాయాలతో వరల్డ్ క్లాస్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్గా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కోరారు. ఇది ఎక్కడ ఏర్పాటు చేయాలనే అంశంపై మరింత వివరంగా చర్చించి నిర్ణయం తీసుకుందామని అన్నారు.