నంద్యాలలో గెలుపు కోసం పక్కా వ్యూహం

First Published Jul 11, 2017, 3:57 PM IST
Highlights

ఎప్పుడైతే ఉపఎన్నికలో గెలవటాన్ని చంద్రబాబు ప్రతిష్టగా తీసుకున్నారో అప్పటి నుండే ఆయా సామాజికవర్గాల్లో పట్టుందని ప్రచారంలో ఉన్న నేతలకు పండగ మొదలైంది. వారు అడగటమే ఆలస్యం మంత్రులు అప్పటికప్పుడే అన్నీ మంజూరు చేయించేస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే నియోజకవర్గాన్నిచక్కబెట్టేయాలన్నది చంద్రబాబు ఆలోచన.

నంద్యాల ఉపఎన్నికలో గెలవటానికి చంద్రబాబునాయుడు పక్కా  వ్యూహంతో ముందుకెళుతున్నారు. సామాజిక వర్గం మంత్రులను రంగంలోకి దింపారు. ఓటర్లను సామాజిక వర్గాల వారీగా విడదీసి తాయిలాలు పంచుతున్నారు. సామాజికవర్గాల వారిగా సంక్షేమ భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నారు. ఆయా సామాజికవర్గాల్లో పట్టున్న నేతలతో మాట్లాడేందుకు మంత్రులను రంగంలోకి దింపారు. ఎప్పటి నుండో పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులకు ఇపుడు మోక్షం ప్రసాదించారు.

నంద్యాలలోని కాపుల కోసం సంక్షేమ భవన్ నిర్మాణానికి ప్రభుత్వం ఈరోజు రూ. 3 కోట్లు మంజూరు చేయటం ఇందులో భాగమే. నియోజకవర్గంలో బలిజ(కాపు) ఓటర్ల సంఖ్య నిర్ణయాత్మకం. నియోజకవర్గంలో రెడ్డి, బలిజ, బిసి, వైశ్య, ముస్లిం మైనారిటీలెక్కువ. అందుకని ఏ సామాజికవర్గం ఓటర్లను ఆకట్టుకోవాలంటే ఆ సామాజికవర్గం మంత్రులు, నేతలనే చంద్రబాబు రంగంలోకి దింపుతున్నారు.

ఇందులో భాగంగానే రెడ్డి సామాజికవర్గం ఓట్ల కోసం మంత్రులు అమరనాధరెడ్డి, ఆది నారాయణరెడ్డి పర్యటిస్తున్నారు. బలిజల ఓట్ల కోసం నారాయణ, మైనారిటీల ఓట్ల కోసం మాజీ మంత్రి ఎన్ఎండి ఫరూఖ్, నౌమన్, వైశ్య ఓట్ల కోసం రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేష్, బిసిల ఓట్ల కోసం కాల్వ శ్రీనివాసులు, కింజరాపు అచ్చెన్నాయడుని సిఎం ఉపయోగించుకుంటున్నారు. వీరుకాక జిల్లా మంత్రి కెఇ కృష్ణమూర్తి, భూమా అఖిలప్రియ ఎటూ ఉండనే ఉన్నారు.

సామాజిక వర్గాల వారీగా ఓటర్లను ఆకట్టకోవాలంటే మంత్రులు, నేతలను మాత్రమే రంగంలోకి దింపితే కుదరదు కదా? అందుకనే మొదటి విడతగా అభివృద్ధి పనులంటూ సుమారు రూ. 150 కోట్లు విడుదల  చేసారు. వివిధ సామాజికవర్గాల లబ్దిదారుల కోసం దాదాపు 5 వేల కుట్టుమిషన్లు, రేషన్ షాపు డీలర్ షిప్పుల నియామకం చేస్తున్నారు. ఆయా సామాజికవర్గాల్లో కాస్త పట్టుంది అనుకున్న వారికోసం బిసి, కాపు కార్పొరేషన్ల ద్వారా క్యాబ్ లు, ట్రాక్టర్లు, అవకాశం ఉన్నంతలో రుణాలు కూడా మంజూరు చేయిస్తున్నారు.

ఎప్పుడైతే ఉపఎన్నికలో గెలవటాన్ని చంద్రబాబు ప్రతిష్టగా తీసుకున్నారో అప్పటి నుండే ఆయా సామాజికవర్గాల్లో పట్టుందని ప్రచారంలో ఉన్న నేతలకు పండగ మొదలైంది. వారు అడగటమే ఆలస్యం మంత్రులు అప్పటికప్పుడే అన్నీ మంజూరు చేయించేస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే నియోజకవర్గాన్నిచక్కబెట్టేయాలన్నది చంద్రబాబు ఆలోచన. అందుకనే ప్రతీ రోజు మంత్రులు అదే పనిగా పర్యటిస్తూ తాయిలాలతో ముంచెత్తుతున్నారు.

click me!