కేంద్రప్రభుత్వానికి చంద్రబాబునాయుడు ఎంతగా భయపడిపోతున్నారో అర్ధమైపోతోంది. తాజాగా జరిగిన ఓ ఘటనే అందుకు నిదర్శనంగా నిలిచింది. చంద్రబాబు అధ్యక్షతన బుధవారం మంత్రివర్గ సమావేశం జరిగింది. ప్రస్తుత రాజకీయ పరిస్ధితుల నేపధ్యంలో మంత్రివర్గ సమావేశం అంటే ఎంతో హాటుహాటుగా జరుగుతుందని అందరూ భావించారు.
ఎందుకంటే, ప్రత్యేకహోదా కేంద్రంగా రాష్ట్రంలో రాజకీయాలు చాలా వేడిగా, వాడిగా ఉంటున్నాయి. వైసిపి ఎంపిల రాజీనామాలు, కేంద్రంపై అవిశ్వాస తీర్మానం లాంటవన్నీ అందరికీ తెలిసిందే. మిత్రపక్షాలు మినహా మిగిలిన రాజకీయపార్టీలన్నీ ఏకమయ్యాయి. దాంతో రాజకీయ వాతావరణం చాలా వేడిగా ఉంది.
ఇటువంటి నేపధ్యంలో ఈరోజు మంత్రివర్గ సమావేశం జరుగుతోందంటేనే మంత్రులు, టిడిపి నేతలు ఎంతో ఉత్కంఠంగా ఉన్నారు. టిడిపి-బిజెపిల పొత్తుపైన, రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై తేవల్సిన ఒత్తిడిపైన తీవ్రమైన నిర్ణయం తీసుకుంటారు చంద్రబాబు అని అందరూ ఎదురు చూశారు. సుదీర్ఘంగా జరిగిన భేటీ చివరకు ఎటువంటి చర్చ జరగకుండానే ముగిసింది.
ప్రతీరోజు సమన్వయ కమిటి సమావేశాలని, పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్సులు గంటల తరబడి నిర్వహిస్తున్న చంద్రబాబు మంత్రివర్గ సమావేశంలో మాత్రం కనీస ప్రస్తావన ఎందుకు తీసుకురాలేదు? అంటే, మంత్రివర్గంలో బిజెపి మంత్రులుండటమే కారణం. చంద్రబాబు మంత్రివర్గంలో బిజెపికి చెందిన కామినేని శ్రీనివాసరావు, పైడింకొడల మాణిక్యాలరావు మంత్రులుగా ఉన్నారు.
బిజెపికి చెందిన మంత్రుల్లో కామినేని ఎటూ చంద్రబాబు మనిషిగానే ముద్రపడ్డారు. కాబట్టి ఆయనతో ఏ ఇబ్బందీ లేదు. ఎటుతిరిగి సమస్యంతా మాణిక్యాలరావుతోనే. మొదటి నుండి కూడా మాణిక్యాలరావు సిఎంను ఏరోజు లెక్క చేయలేదు. పైగా గడచిన బడ్జెట్ నేపధ్యంలో చంద్రబాబును, టిడిపిని దుమ్ముదులిపేస్తున్నారు.
అటువంటి పరిస్ధితుల్లో మంత్రివర్గంలో కేంద్రంపైన, ప్రధానమంత్రి నరేంద్రమోడిపైన చంద్రబాబు కానీ మంత్రులు కానీ ఏమన్నా మాట్లాడితే ఇంకేమన్నా ఉందా? చంద్రబాబు కొంప కొల్లేరే అనటంలో సందేహం లేదు. అందుకనే మాణిక్యాలరావు దెబ్బకు భయపడి మంత్రివర్గంలో చర్చకే అవకాశం ఇవ్వలేదట.