లీడర్‌ను బట్టే కేడర్ ... వాళ్లు జనసైనికులు కాదు, జనసైకోలు : విశాఖ దాడి ఘటనపై గుడివాడ ఆగ్రహం

By Siva KodatiFirst Published Oct 15, 2022, 7:51 PM IST
Highlights

విశాఖ గర్జన కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్తున్న మంత్రులు ఆర్కే రోజా, జోగి రమేష్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిల కార్లపై ఎయిర్‌పోర్ట్ వద్ద జనసేన కార్యకర్తలు దాడి చేశారు. దీనిపై మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఘాటుగా స్పందించారు. 
 

విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో వైసీపీ నేతల కాన్వాయ్‌పై జరిగిన దాడిని ఖండించారు మంత్రి గుడివాడ అమర్‌నాథ్. దాడి ఘటనకు పవన్ కల్యాణ్ బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. వెంటనే పవన్ కల్యాణ్ క్షమాపణ చెప్పాలని గుడివాడ కోరారు. వాళ్లు జనసైనికులు కాదని.. జనసైనికులంటూ మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లీడర్‌ను బట్టి కేడర్ ప్రవర్తన వుంటుందని.. ఇది ఉద్యమంపై చేసిన దాడి అని గుడివాడ అమర్‌నాథ్ ఆరోపించారు. 

ఇంట్లోనే సర్దుకోలేని పవన్ ప్రజలతో ఎలా అడ్జస్ట్ అవుతారని అమర్‌నాథ్ ప్రశ్నించారు. జనసేన నడిచేదే నాదెండ్ల డైరెక్షన్లో, చంద్రబాబు ప్రొడక్షన్‌లో అని ఆయన సెటైర్లు వేశారు. నాదెండ్ల శిఖండి వ్యవహారాలు మానుకోవాలని అమర్‌నాథ్ హితవు పలికారు. టీడీపీ... దాని మిత్రపక్షంగా జనసేన వున్నప్పుడే కోడి కత్తి సంఘటన జరిగిందని ఆయన గుర్తుచేశారు. కోడి కత్తితో ఎవరు దాడి చేశారో పట్టుకున్నారని.. ఈ అంశంపై విచారణ జరుగుతోందని అమర్‌నాథ్ పేర్కొన్నారు. 

ALso Read:అల్లరి మూక.. జనసేనకు ఓ విధానం లేదు : విశాఖలో దాడి ఘటనపై వైవీ సుబ్బారెడ్డి ఆగ్రహం

అంతకుముందు మంత్రి జోగి రమేశ్ కూడా ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు. జనసేనది చిల్లర వ్యవహారమని.. మాపై దాడి చేస్తే ఏం వస్తుందని జోగి రమేశ్ ప్రశ్నించారు. అరాచకవాదులందరినీ పవన్ చేరదీస్తున్నాడని ఆయన మండిపడ్డారు. మమ్మల్ని చూసి కవ్వించే కార్యక్రమాలకు జనసేన కార్యకర్తలు దిగారని జోగి రమేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కిరణ్ అనే తమ కార్యకర్తని చావబాదారని.. రక్తం కారుతున్నా వదల్లేదని జోగి రమేశ్ అన్నారు. జనసేన కార్యకర్తల్ని పవన్ కల్యాణ్ అదుపులో పెట్టుకోవాలని.. ఇలాంటి ఘటన మరోసారి జరిగితే ఊరుకునేది లేదని జోగి రమేశ్ హెచ్చరించారు. 

అసలేం జరిగిందంటే:

వైవీ సుబ్బారెడ్డి, జోగి రమేశ్ ఇతర వైసీపీ నేతలు విశాఖ గర్జనలో పాల్గొని తిరిగి వెళ్తుండగా.. సరిగ్గా అదే సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖలో అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలోనే మంత్రుల వాహనాలపై కర్రలు, రాళ్లతో జనసేన కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటనలో కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. దాడి జరిగిన సమయంలో వైవీ సుబ్బారెడ్డి, జోగి రమేశ్‌లు ఒకే కారులో ప్రయాణిస్తున్నారు. 
 

click me!