
టీడీపీ సీనియర్ నేత , మాజీ మంత్రి యనమల రామకృష్ణుడుపై మండిపడ్డారు మంత్రి దాడిశెట్టి రాజా. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యనమల పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. అనేక విషయాల్లో రాష్ట్రానికి జాతీయ గుర్తింపు లభించిందని.. విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని దాడిశెట్టి రాజా వెల్లడించారు. టీడీపీ హయాంలో స్కూళ్లలో టాయిలెట్లు కూడా సరిగాలేవని .. నాడు నేడు కింద పాఠశాలల రూపరేఖలను మార్చామని మంత్రి స్పష్టం చేశారు. యనమల స్వగ్రామంలోనూ ఈ పనులు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. ఆయన తనతో పాటు వస్తే దగ్గరుండి చూపిస్తానని.. హైస్కూల్ వస్తే మన పొలాల్లో పనిచేసేందుకు ఎవరూ వుండరని యనమల వ్యాఖ్యానించారని దాడిశెట్టి రాజా దుయ్యబట్టారు.
ఇకపోతే.. కొద్దిరోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వంపై యనమల రామకృష్ణుడు కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ఆర్ధిక స్థితిగతులపై శ్వేతపత్రం ఇచ్చే దమ్ము ప్రభుత్వానికి వుందా అని యనమల సవాల్ విసిరారు. ఆర్ధిక శాఖలో ఏం జరుగుతుందో ఆ శాఖ మంత్రికి తెలుసా.. అసలు ఆర్ధిక శాఖపై పెత్తనమంతా జగన్దేనని యనమల ఆరోపించారు. కేంద్రం రాష్ట్రానికి ఎన్ని కోట్ల నిధులు ఇచ్చింది.. ఎన్ని కోట్లు దారిమళ్లాయి ?, ఉద్యోగులకు జీతాలు, జీపీఎఫ్, పీఆర్సీ ఎందుకివ్వడం లేదని యనమల ప్రశ్నించారు.
ALso REad: బుగ్గనకు ఏం తెలుసు..ఆర్ధిక శాఖపై పెత్తనమంతా జగన్దే : వైసీపీ ప్రభుత్వంపై యనమల ఆగ్రహం
ఇదిలావుండగా.. గత నెలలో రాష్ట్రంలో రవాణా వాహనాల పన్నును ఏపీ ప్రభుత్వం పెంచడంపై యనమల రామకృష్ణుడు ఫైర్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వం ధరలను పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలనపై ప్రజలకు అసహ్యం కలుగుతోందని.. రవాణా వాహనాల పన్నును పెంచడం వల్ల ప్రజలకు ప్రతి ఏటా రూ.250 కోట్ల అదనపు భారం పడుతోందన్నారు. టీడీపీ హయాంలో ప్రతి 6 నెలలకు రవాణా శాఖకు రూ.1500 కోట్ల ఆదాయం వచ్చేదని.. ప్రస్తుత వైసీపీ పాలనలో అది రూ.2,131 కోట్లకు పెరిగిందని యనమల దుయ్యబట్టారు.