పోలవరం నిర్మాణం... ఐదుగురు ఇంజనీర్లు, 80మంది సిబ్బంది కరోనాకు బలి: మంత్రి అనిల్ ఆవేధన

By Arun Kumar PFirst Published Jun 2, 2021, 5:10 PM IST
Highlights

ఇవాళ(బుధవారం)పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించడంతో పాటు సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్. 

పోలవరం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం 2022 ఖరీఫ్ నాటికి పోలవరం ప్రాజెక్టు నుంచి నీళ్ళు ఇస్తామని నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. అందుకు తగినట్లుగానే పోలవరం నిర్మాణంలో ప్రణాళికలను అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు.  

ఇవాళ(బుధవారం)పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించడంతో పాటు సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు మంత్రి అనిల్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...  2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం మూడేళ్ళ పాటు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా, చివరి రెండేళ్ళు హడావుడి చేసిందన్నారు. అలాంటిది టిడిపి నేతలు దద్దమ్మల్లావైసిపి ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. 

''కోవిడ్ కష్టకాలంలోనూ ధైర్యంగా పనిచేస్తూ ముందుకు వెళుతున్నాం. కోవిడ్ ను సాకుగా చూపించి మేం వెనకడుగు వేయటం లేదు.  పోలవరం ప్రాజెక్టులో పనిచేస్తున్న ఐదుగురు ఇంజనీర్లు, ఇరిగేషన్ శాఖలో మొత్తం 80 మంది సిబ్బంది కోవిడ్ కారణంగా మరణించినా ఎక్కడా పనులు ఆపలేదు. గత ఏడాదికి పైగా కోవిడ్ నేపథ్యంలో లాక్ డౌన్ అమలులో ఉన్నా, వేలాది మంది కార్మికులు ధైర్యంగా పనిచేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా, వారిని కించపరిచే విధంగా మాట్లాడటం మంచిది కాదు'' అన్నారు.

''కోవిడ్ నేపథ్యంలో గత ఏడాదిన్నర కాలంలో చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్ పట్టుమని పది రోజులు కూడా బయటకు రాలేదు. మీవేనా ప్రాణాలు... అధికారులవి, కార్మికులవి ప్రాణాలు కాదా..? ఇళ్ళల్లోని బెడ్ రూముల్లో కూర్చుని జూమ్ టీవీల్లో పసలేని విమర్శలు చేస్తున్నారు. గత సీజన్ లో ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు వేలాది మంది సొంత ప్రాంతాలకు వెళ్ళిపోయారు. ఈరోజు కార్మికులు కూడా దొరకడం లేదు'' అని పేర్కొన్నారు. 

video   పోలవరం ప్రాజెక్ట్ పనులను పరిశీలించిన మంత్రి అనిల్

''కోవిడ్ వల్ల రాష్ట్రం, దేశంలో మాత్రమే కాదు ప్రపంచం అంతా ఎక్కడికక్కడ పనులు ఆగిపోయాయి, కనీసం రోడ్డు వేయాలన్నా కార్మికులు దొరకని పరిస్థితి అన్నిచోట్లా ఉంది.  కోవిడ్ లోనూ కుటుంబాలను వదిలేసి పనిచేస్తున్న సిబ్బందిని అభినందించాలి... అది ఎటూ టీడీపీకి చేతకాదు. పోలవరం ప్రాజెక్టు కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్క చిన్న కార్మికుడికి మనస్ఫూర్తిగా మేం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం'' అన్నారు. 

''చంద్రబాబు హయాంలో పోలవరం కాఫర్ డ్యామ్ ను సక్రమంగా కట్టకపోవడం, ప్రణాళికా లోపం వల్ల డయాఫ్రం వాల్ డ్యామెజ్ అయింది. దీనికి కారణం మీరు కాదా..? ఇది చంద్రబాబు ప్రభుత్వం చేతగానితనం వల్ల కాదా..? ఇవన్నీ కప్పిపుచ్చి, దాచిపెట్టి మాపై విమర్శలు చేస్తారా.. ? టీడీపీ హయాంలో ప్రాజెక్టు పునరావాసానికి సంబంధించి ఒక్క ఇల్లును అయినా మార్చారా..?'' అని మంత్రి ప్రశ్నించారు. 

''పోలవరం ఆర్ అండ్ ఆర్ కు సంబంధించి కూడా సమీక్ష చేశాం. ప్రాజెక్టు పునరావాసానికి సంబంధించి 17 వేల ఇళ్ళను ఏప్రిల్ కల్లా పూర్తి చేయాలనుకున్నాం. కానీ ఉభయ గోదావరి జిల్లాల్లో వేలల్లో కేసులు వస్తున్నాయి. పని చేయడానికి ఎవరూ ముందుకు రాని పరిస్థితి. ఎన్ని సమస్యలు ఉన్నా కచ్చితంగా ఈ సీజన్ లో నూటికి నూరు శాతం వారికి పునరావాసం కల్పించి తీరుతాం.  సమస్యలు ఉన్నా ధైర్యంగా ముందుకు వెళుతున్నాం'' అని మంత్రి అనిల్ కేమార్ ధీమా వ్యక్తం చేశారు. 
 

click me!