మృత్యువుతో పోరాడి కన్నుమూసిన మెడికో ప్రియాంక.. అసలేం జరిగిందంటే?

Published : Aug 09, 2026, 06:37 PM IST
Medico Priyanka

సారాంశం

Medico Priyanka: రాజమహేంద్రవరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మెడికో ప్రియాంక కన్నుమూశారు. ఆగస్టు 3న ఇద్దరు యువకులు ప్రయాణిస్తున్న కారు ఆమె స్కూటీని ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాలైన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విష‌యం తెలిసిందే.

ఆగస్టు 3న అసలేం జరిగింది?

ప్రియాంక తన స్నేహితురాలితో కలిసి ఆగస్టు 3 రాత్రి రాజమహేంద్రవరంలోని ప్రసాద్ ఆదిత్య మాల్‌కు వెళ్లారు. సినిమా చూసిన అనంతరం స్కూటీపై బయటకు వస్తుండగా రోడ్డుపై ట్రాఫిక్ ఉండటంతో కొద్దిసేపు ఆగాల్సి వచ్చింది. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన కారు ఆమె ప్రయాణిస్తున్న స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రియాంకకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ స‌మ‌యంలో కారులో నామవరం ప్రాంతానికి చెందిన సురవరపు దుష్యంత్, లాలాచెరువుకు చెందిన ఆండ్రూ విలియం జోసెఫ్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే తొలుత ర్యాష్ డ్రైవింగ్‌కు సంబంధించిన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా కేసులో కీలకమైన సెక్షన్లను మార్చారు. ప్రస్తుతం ఇద్దరు నిందితులు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు.

పరిస్థితి విషమం.. హైదరాబాద్‌కు తరలింపు

ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రియాంకకు తొలుత రాజమహేంద్రవరంలో చికిత్స అందించారు. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి వైద్యులు ఆమెను కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ప్రియాంక పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో వైద్యులు బ్రెయిన్ డెత్ నిర్ధారణకు అవసరమైన పరీక్షలు నిర్వహించేందుకు ప్రయత్నించారు. అయితే ఆమె శరీర పరిస్థితి సహకరించకపోవడంతో కొన్ని పరీక్షలు నిర్వహించడంలో ఇబ్బందులు ఎదురైనట్లు వైద్యులు వెల్లడించారు. చివరకు ఆమె పరిస్థితి మరింత క్షీణించడంతో బ్రెయిన్‌డెడ్‌గా నిర్ధారించారు. వైద్యుల ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఆదివారం మధ్యాహ్నం ఆమె మృతి చెందినట్లు ప్రకటించారు.

ప్రియాంక తండ్రి ఆవేదన

కుమార్తె మృతితో ప్రియాంక కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె తండ్రి వెంకటేష్ డిమాండ్ చేశారు. ప్ర‌మాదానికి కార‌ణ‌మైన వారిపై కఠినమైన సెక్షన్ల కింద చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు.

హత్యాయత్నం కేసు.. ఇప్పుడు హత్య కేసుగా మారుతుందా?

ప్రియాంకను ఢీకొట్టిన ఘటనపై ఇప్పటికే నిందితులు దుష్యంత్, ఆండ్రూ జోసెఫ్‌పై హత్యాయత్నానికి సంబంధించిన కేసు నమోదు చేసినట్లు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ కిషోర్ తెలిపారు. ప్రమాదం ఉద్దేశపూర్వకంగా జరిగిందని దర్యాప్తులో నిర్ధారణ అయితే హత్యాయత్నం కేసును హత్య కేసుగా మార్చే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. కేసులో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరినీ గుర్తించి అరెస్టు చేస్తామని, నిందితులను కస్టడీకి తీసుకునేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

ప్రియాంక స్వస్థలం గద్వాల జిల్లా అయిజ మండలం ఎక్లాస్‌పూర్. ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఆమె రాజమహేంద్రవరంలో పీజీ చదువుతున్నారు. వైద్యురాలిగా మంచి భవిష్యత్తు కోసం అడుగులు వేస్తున్న సమయంలో జరిగిన ఈ విషాద ఘటన ఆమె కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ప్రియాంక చివరకు కన్నుమూయడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు విషాదంలో మునిగిపోయారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Thalliki Vandanam: తల్లికి వందనం నిధులు రాలేదా? టెన్షన్ పడకండి.. మీకో గుడ్ న్యూస్ !
చీరను నేసిన సీఎం చంద్రబాబు | CM Chandrababu Chirala tour | Asianet Telugu