క్షణికావేశంలో తల్లి ఆత్మహత్య.. ‘నేను రాను.. మీరు బాగా చదువుకోండి’ అని చెప్పి.. తండ్రి బలవన్మరణం..!!

By SumaBala BukkaFirst Published Jan 3, 2023, 9:29 AM IST
Highlights

ఓ తండ్రి పిల్లల్ని అనాథల్ని చేశాడు. భార్య రెండు వారాల క్రితమే చనిపోవడంతో మనస్థాపంతో నలుగురు చిన్నారుల్ని ఐసీడీఎస్ అధికారులకు అప్పజెప్పి ఆత్మహత్య చేసుకున్నాడు. 

అన్నమయ్య జిల్లా : ఓ నలుగురు చిన్నారులు తల్లిని కోల్పోయారు.  ఐసిడిఎస్ అధికారుల పర్యవేక్షణలో ఉన్నారు. చిన్నారులను చూడడానికి వచ్చిన తండ్రి.. చెప్పిన మాటలు హృదయాన్ని మెలిపెడుతున్నాయి. ‘కన్నా మిమ్మల్ని చూడటానికి ఇకమీదట నేను రాలేను. ఇక్కడి మేడం వాళ్ళు చెప్పినట్లు వినండి. బాగా చదువుకోండి..’ అని చెప్పాడు. ఆ తర్వాత రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరులో జరిగిన ఈ ఘటనతో ఆ నలుగురు చిన్నారులు అనాధలుగా మారిపోయారు.

కలమడి ప్రసాద్ బాబు (35), సుకన్య (28)  అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరుకు చెందిన దంపతులు. వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు. ఐశ్వర్య, అక్షిత, అరవింద్, అవినాష్ లు.సుకన్య ఇంట్లో ఉండే పిల్లలను చూసుకుంటుండగా.. ప్రసాద్ బాబు బేల్దారి పనులు చేసేవాడు. ఇటీవలి కాలంలో వీరిద్దరి మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో మనస్థాపానికి గురైన సుకన్య క్షణికావేశంలో ఉరేసుకుని  మరణించింది. భార్య మరణంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు ప్రసాద్ బాబు.  

జగన్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఏపీలో రోడ్లపై సభలు, ర్యాలీలపై నిషేధం..

డిసెంబర్ 29న ఐసీడీఎస్ అధికారులకు స్థానిక అంగన్వాడీ సిబ్బంది ద్వారా తన నలుగురు పిల్లలను అప్పజెప్పాడు. ఆ సమయంలో తల్లి లేకపోవడం వల్ల నలుగురు పిల్లలను చూసుకోవడం పోషించడం తనకు కష్టమవుతుందని రాసిచ్చాడు. అతని మాటలు నమ్మిన వారు నలుగురు పిల్లలను పోలీసుల సమక్షంలో తన సంరక్షణలోకి తీసుకున్నారు. రాజంపేట బాలసదన్ లో ఆ నలుగురు చిన్నారులను చేర్చారు.

అయితే ప్రసాద్బాబు తాను కూడా చనిపోవాలని నిర్ణయించుకొని ఇదంతా చేశాడని ఇప్పుడు తెలుస్తోంది. ఆదివారం న్యూ ఇయర్ సందర్భంగా ప్రసాద్ బాబు బాలసదన్ లో ఉన్న పిల్లల దగ్గరికి వెళ్ళాడు. వారితో చాలాసేపు సరదాగా గడిపాడు. ఆ సమయంలోనే చిన్నారులకి తాను ఇక రావని.. అధికారులు చెప్పినట్లు వినాలని బాగా చదువుకోవాలని పిల్లలకు చెప్పాడు. ఆ తర్వాత సోమవారం ఉదయం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తర్వాత సిడిపిఓ రాజేశ్వరి మాట్లాడుతూ పిల్లలను అప్పగించే ముందు రోజు నుంచి తాను చనిపోతానని, జాగ్రత్తగా చూసుకోవాలని ప్రసాద్బాబు చెప్పాడని..  అతనికి ఎంతో కౌన్సిలింగ్ చేశామని.. అదేమీ ఉపయోగం లేకుండా పోయిందని  అన్నారు.

click me!