కేజీహెచ్‌లో ఉద్రిక్తత: స్పృహ తప్పి పడిపోయిన ముగ్గురు బాధితులు

By Siva KodatiFirst Published May 12, 2020, 6:07 PM IST
Highlights

విశాఖ కేజీహెచ్‌లో ఉద్రిక్తత నెలకొంది. ఎల్‌జీ పాలిమర్స్‌‌ ఘటనలో తీవ్ర అస్వస్థతకు గురైన బాధితులు అక్కడ చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేజీహెచ్‌లోని రాజేంద్ర ప్రసాద్ వార్డులో వున్న బాధితులు డిశ్చార్జ్‌ అయ్యేందుకు నిరాకరించారు. 

విశాఖ కేజీహెచ్‌లో ఉద్రిక్తత నెలకొంది. ఎల్‌జీ పాలిమర్స్‌‌ ఘటనలో తీవ్ర అస్వస్థతకు గురైన బాధితులు అక్కడ చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేజీహెచ్‌లోని రాజేంద్ర ప్రసాద్ వార్డులో వున్న బాధితులు డిశ్చార్జ్‌ అయ్యేందుకు నిరాకరించారు.

తాము పూర్తిగా కోలుకున్న తర్వాతే ఇళ్లకు వెళ్తామని వారు తేల్చి చెప్పారు. అయితే బాధితులను వారి స్వస్థలాలకు చేర్చేందుకు రాజేంద్రప్రసాద్ వార్డుకు ఐదు ఆర్టీసీ బస్సలు వచ్చాయి. అయితే వారు వెళ్లేందుకు ససేమిరా అనడంతో పాటు నిరసనకు దిగారు.

Also Read:కేజీహెచ్ వద్ద ఎల్జీ పాలీమర్స్ బాధితుల ధర్నా

ఈ ఘటనలో ముగ్గురు స్పృహ తప్పి పడిపోయారు. దీంతో ఆసుపత్రి సిబ్బంది బాధితులను తిరిగి వార్డుల్లోకి పంపారు. ఉద్రిక్త పరిస్ధితుల నేపథ్యంలో రాజేంద్రప్రసాద్ వార్డు దగ్గర భారీగా పోలీసులను మోహరించారు. 

అంతకుముందు ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్ లీకేజ్ ఘటనలో తీవ్ర అస్వస్థతకు గురైన బాధితులను మంగళవారం వైసీపీ నేతలు పరామర్శించి, యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. 

ఎల్.జి. పాలిమర్స్ బాధితులు ఏ ఒక్కరూ తప్పిపోకుండా ఎన్యూమరేషన్ చేయిస్తున్నట్లు జిల్లా ఇన్ చార్జ్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని, అందరూ సంయమనం పాటించాలన్నారు.  

ప్రస్తుతం 367 మంది చికిత్స పొందుతున్నారని, ఈ రోజు ఆరోగ్యంగా ఉన్నవారిని 200 మంది వరకు ఆసుపత్రి నుండి విడుదల చేయనున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి ఆదేశాల పై ఈ రోజు ఆసుపత్రి నుండి పూర్తి ఆరోగ్యంతో విడుదలైన వారికి ప్రభుత్వం రవాణా సౌకర్యం కల్పించి వారి స్వగృహాలకు పంపనున్నట్లు కన్నబాబు తెలిపారు.  

Also Read:అదంతా ఎల్లో మీడియా రాజకీయం.. జగన్ కారు దిగడానికి కారణం అదే.. విజయసాయిరెడ్డి

రాజ్యసభ సభ్యులు వి. విజయ సాయి రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం కె.జి.హెచ్.లో 300 మంది చికిత్స పొందుతున్నారని, ప్రైవేట్ ఆసుపత్రుల్లో 67 మంది ఉన్నారన్నారు. ఈ రోజు 200 మంది వరకు ఆరోగ్యంగా ఉన్నవారిని ఆసుపత్రి నుండి విడుదల చేస్తారని, వారి వారి గృహాలకు వెల్లేందుకు రవాణా సౌకర్యం కల్పించమని ముఖ్యమంత్రి ఆదేశించారని చెప్పినట్లు తెలిపారు.  

మిగిలిన వారు చికిత్స పొందుతున్నారని, చికిత్స బాగా జరుగుతుందని తెలిపారు.  5 గ్రామాల్లో పరిస్థితి సాధారణ స్థాయికి వచ్చిందని, ప్రజలంతా సంతృప్తిగా ఉన్నారని, గ్రామాల్లో నివాస యోగ్యంగా ఉన్నదని, గ్రామస్తుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు ఆయా గ్రామాల్లోనే రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసన సభ్యులు రాత్రి బస చేసినట్లు వివరించారు.

click me!