
అధికారంలో ఉన్నాం కదా అని పబ్లిక్ లో ఎలా మాట్లాడినా చెల్లుబాటవుతుందని అనుకుంటే పొరబాటే. ఎక్కడో ఓసారి జనాలను దబాయించి బయటపడొచ్చేమో కానీ అన్నీ చోట్లా సాధ్యం కాదు. ఒక్కోసారి అడ్డంగా బుక్కైపోవాల్సి వస్తుంది. ఇదంతా ఎందుకంటే, ఈరోజు నారా లోకేష్ కు కర్నూలులో అటువంటి చేదు అనుభవమే ఎదురైంది. దాంతో లోకేష్ కు దిమ్మతిరిగింది. బహిరంగ సభలో పాల్గొన్న లోకేష్ నోరు జారటంతో జనాలు వేదికమీదకు వచ్చి మరీ వాదన పెట్టుకుని ఫుల్లుగా తలంటిపోసేసారు.
ఇంతకీ జరిగిందేమిటంటే, తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనయుడు, రాష్ట్ర ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. కర్నూలులోని ఓ సభలో మంత్రి మాట్లాడుతూ, రాయలసీమకు కియా కార్ల ఫ్యాక్టరీ వచ్చిందని దానివల్ల 5 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు. మంత్రి ఆమాట చెప్పగానే స్ధానికులు ఒక్కసారిగా లోకేష్ పై మండిపడ్డారు. కియా ఫ్యాక్టరీలో ఉద్యోగం వచ్చిన ఒక్కరినైనా చూపండని స్ధానికులు లోకేష్ ను నిలదీసారు. దాంతో మంత్రి బిత్తరపోయారు. ‘అన్నా ఇల్లు కట్టాలంటే ఎంత కష్టమో తెలీదా’ అంటూ విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేసారు.
వెంటనే కియా మోటార్స్ విషయం వదిలిపెట్టేసి రాయలసీమకు భారీగా పరిశ్రమలొచ్చాయంటూ మాటను దాటేసారు. పరిశ్రలమను అడ్డుకోవద్దని కోరారు. దాంతో స్ధానికులు మరిత రెచ్చిపోయారు. ఈ జిల్లా వాళ్ళమై ఉండి అభివృద్ధిని అడ్డుకుంటామా? అంటూ లోకేష్ నే నిలదీయటంతో ఏం సమాధానం చెప్పాలో అర్ధం కాలేదు. దాంతో ఇరువైపులా వేదికమీదే వాదన మొదలైంది. వెంటనే అక్కడే ఉన్న టిడిపి నేతలు కెఇ ప్రభాకర్ తదితరులు స్ధానికులకు సర్ది చెప్పబోయారు. అయినా వారు వినలేదు.
స్థానిక నేతలు లోకేష్ను ప్రశ్నించిన వారిని అడ్డుకున్నారు. దీంతో స్థానికుల ఆగ్రహం రెట్టింపయింది. ‘మీ నాయకుడి ముందు మీరు ఎలాగూ మాట్లాడలేరు..కనీసం మమ్మల్ని అయినా మాట్లాడనివ్వారా’ అంటూ నేతలపై మండిపడ్డారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలపై, తమ సమస్యలపై రాష్ట్ర మంత్రులను ప్రశ్నిస్తే అడ్డుకోవడమేంటంటూ ధ్వజమెత్తారు. దాంతో లోకేష్ తో పాటు నేతలకు కూడా ఏం చేయాలో తెలీద దిక్కులు చూడటం మొదలుపెట్టారు.