తాడిపత్రిలో టీడీపీ గెలుపు తాడిపత్రి ప్రజల గెలుపు అని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పారు. కంటికి రెప్పలా తాడిపత్రి ప్రజలను కాపాడుకొంటానని ఆయన హమీ ఇచ్చారు.
తాడిపత్రి: తాడిపత్రిలో టీడీపీ గెలుపు తాడిపత్రి ప్రజల గెలుపు అని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పారు. కంటికి రెప్పలా తాడిపత్రి ప్రజలను కాపాడుకొంటానని ఆయన హమీ ఇచ్చారు.
ఆదివారం నాడు తాడిపత్రి మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి ఓ తెలుగు న్యూస్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు.తన ఇంటికి వచ్చి తన వారిపై దాడి చేయడంతో పాటు తనను బండ బూతులను ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తిట్టిన రోజునే ప్రజలు నిర్ణయం తీసుకొన్నారన్నారు.
ప్రజలు టీడీపీ, వైసీపీ అని చూడలేదని ఆయన అభిప్రాయపడ్డారు. సేవ్ తాడిపత్రి అనే నినాదంపై ప్రజలు చర్చించుకొన్నారన్నారు.
గతంలో దేశంలోనే తాడిపత్రి మున్సిపాలిటీ నెంబర్ 1గా ఉండేదన్నారు. ఈ అంశాలను ప్రజలు గుర్తు చేసుకొని తమకు ఓటు చేశారని ఆయన అభిప్రాయపడ్డారు.
అధికారంలో ఉన్న సమయంలో ఇష్టారీతిలో నాయకులు వ్యవహరించారన్నారు. అధికారం కోల్పోయిన సమయంలో భయపడి ఇంట్లో కూర్చొన్నారని ఆయన విమర్శించారు. కానీ టీడీపీ కార్యకర్తలు ఏనాడూ కూడ భయపడలేదన్నారు. టీడీపీలో మార్పులు చేర్పులు రావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.ఈ విషయమై చంద్రబాబుతో మాట్లాడుతానని ఆయన చెప్పారు.
also read:తాడిపత్రిలో జేసీ హవా: టీడీపీని గెలిపించిన ప్రభాకర్ రెడ్డి, వైసీపీకి షాక్
ఈ విజయాన్ని తాడిపత్రి ప్రజల విజయంగా ఆయన పేర్కొన్నారు. ప్రజలంతా తమ ఊరిని కాపాడుకోవాలనే ఉద్దేశ్యంతో తమ పార్టీని గెలిపించారన్నారు. తమ పార్టీ నుండి నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకొంటే సంబంధం లేని వ్యక్తులను బరిలోకి దింపామని అయినా కూడ ప్రజలు ఓటు వేసి గెలిపించారని జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పారు.
తమ పార్టీ నుండి విజయం సాధించిన వారెవరూ కూడ పార్టీ మారరని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. మమ్మల్ని ఎవరూ కూడ కొనలేరదని ఆయన తేల్చి చెప్పారు. రెండు మూడు రోజుల్లో ప్రజల వద్దకు వెళ్తామన్నారు.