విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం... వైసిపితో కలిసి నడిచేందుకు సిద్దమే..: పవన్ కల్యాణ్ సంచలన ప్రకటన

Arun Kumar P   | Asianet News
Published : Dec 17, 2021, 02:44 PM ISTUpdated : Dec 17, 2021, 02:49 PM IST
విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం... వైసిపితో కలిసి నడిచేందుకు సిద్దమే..: పవన్ కల్యాణ్ సంచలన ప్రకటన

సారాంశం

విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం డిజిటల్ క్యాంపెయిన్ చేపట్టాలని జనసేన పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు రేపటినుండి మూడు రోజుల పాటు ఈ క్యాంపెయిన్ లో పాల్గొనాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. 

విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణే లక్ష్యంగా జనసేన పార్టీ (janasena party) డిజిటల్ క్యాంపెయిన్ (digital campaign) కు సిద్దమయ్యింది. రేపటినుండి మూడు రోజులపాటు అంటే డిసెంబర్ 18, 19, 20 తేదీల్లో జనసేన చేపట్టనున్న ఈ డిజిటల్ క్యాంపెయిన్ లో పాల్గొనాలని ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ (pawan kalyan) పిలుపునిచ్చారు. ఈ మేరకు జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. 

''స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ (vizag steel plant privatisation) వద్దు అనే విషయాన్ని బలంగా ముందుకు తీసుకువెళ్ళాలి. వైసీపీ (ysrcp) కి 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది లోక్ సభ సభ్యులు బలం ఉండికూడా ఉక్కు పరిశ్రమకు అనుకూలంగా గళం విప్పడం లేదు. పైగా కేంద్రానిదే బాధ్యత అంటూ తప్పించుకునే ధోరణిలో ఉంది. వారికి బాధ్యతను గుర్తు చేయాలన్న లక్ష్యంతోనే ఈ  డిజిటల్ క్యాంపెయిన్ కు శ్రీకారం చుట్టాం. స్టీల్ ప్లాంట్ కోసం ఉద్యమించేలా వైసిపి ఎంపీలు, ఎమ్మెల్యేలపై సోషల్ మీడియా వేదికల ద్వారా ఒత్తిడి తెద్దాం'' అని పవన్ కల్యాణ్ సూచించారు.  

''వైసీపీతో పాటు టీడీపీ (tdp) ఎంపీలు ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ గురించి మాట్లాడాలి. ప్లకార్డులు ప్రదర్శించాలి. ఈ బాధ్యతను వారికి తెలియచేసేలా మన రాష్ట్రానికి చెందిన లోక్ సభ, రాజ్యసభ సభ్యులను ట్యాగ్ చేయాలి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల చేయడంతోపాటు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే విషయాన్ని పార్లమెంట్ కు తెలియచేయమని గౌరవ ఎంపీలను సోషల్ మీడియా ద్వారా కోరదాం. 18వ తేదీ ఉదయం 10గం.కు మన రాష్ట్ర ఎంపీలకు ట్యాగ్ చేసే డిజిటల్ క్యాంపెయిన్ ప్రారంభిస్తున్నాం. మీ లోక్ సభ నియోజక వర్గం నుంచి ఎన్నికైన పార్లమెంట్ సభ్యుడికి, రాష్ట్రం నుంచి ఎన్నికైన రాజ్యసభ సభ్యులకు ట్యాగ్ చేయండి'' అని పవన్ పిలుపునిచ్చారు. 

read more  నాతో పంతానికి దిగితే.. ఫ్రీగా సినిమాలు ఆడిస్తా : జగన్‌కు పవన్ కల్యాణ్ హెచ్చరిక

''ఈ కార్యక్రమం వెనుక ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే ఎంతో మంది బలిదానాలు, త్యాగాలతో వచ్చిన స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవడం. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు గళం విప్పకుండా కేంద్రానిదే బాధ్యత అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. వారికి బాధ్యత గుర్తుచేద్దాం'' అన్నారు. 

''విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం ప్రతి ఆంధ్రుడినీ కదిలించింది. జై తెలంగాణ (jai telangana) అనగానే తెలంగాణ మొత్తం ఎలా మారుమోగుతుందో అలాంటిదే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదం కూడా. రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని పార్టీల ఎంపీలు కలసి రావాల్సిన సమయం ఇది. రాష్ట్ర విభజన నాటి నుంచి ఈ రోజు వరకు అలా ఏ రాజకీయ పార్టీ కలసి రాలేదు. రాజకీయ క్షేత్రంలో పార్టీల మధ్య విబేధాలు ఉన్నా ప్రతి పార్టీ అంతిమ లక్ష్యం ప్రజాసేవే. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ప్రతి ఆంధ్రుడి కర్తవ్యం'' అని పవన్ కల్యాణ్ గుర్తుచేసారు. 

''అందులో భాగంగా 18, 19, 20 తేదీల్లో  పార్లమెంటు సమావేశాల్లో మన ఎంపీలకు వారి బాధ్యతను గుర్తు చేయాల్సిన అవసరం జనసేనకు ఉంది అనిపించింది. గౌరవనీయులైన వైసీపీ, టీడీపీల ఎంపీలకు జనసేన పార్టీ నుంచి ఇదే మా విన్నపం. మీరు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం పార్లమెంటులో ప్లకార్డులు ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. అది మన బాధ్యత. ఇందుకు సంబంధించిన ముఖ్యమైన బాధ్యతను స్వీకరించి వైసీపీ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఇంతకు ముందు కూడా కోరాము. వారు స్పందించలేదు. వైసీపీ నాయకత్వానికి మా మరో విన్నపం. మీరు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి. మీతో కలసి నడవడానికి మేము సంసిద్ధతతో ఉన్నాం. అడగందే అమ్మయినా పెట్టదు అంటారు. మన రాష్ట్ర సమస్యలు, కష్టాలు కేంద్రం దృష్టికి తీసుకువెళ్లకపోతే తప్పు చేసిన వాళ్లమవుతాం'' అని వైసిపి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 

read more  విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ .. చేతగాని వ్యక్తులు చట్టసభల్లో ఎందుకు : వైసీపీపై పవన్ వ్యాఖ్యలు

''జనసేన పక్షాన మా వంతు బాధ్యతగా మేము విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరించవద్దు అనే నినాదాన్ని ఇస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తాం. కార్మికులు, కార్మికుల కుటుంబాలకు అండగా నిలుస్తాం. స్టీల్ ప్లాంట్ కోసం చేసిన త్యాగాలు, బలిదానాలు మేము మర్చిపోము. తెలంగాణ జిల్లాలకు చెందిన వారూ విశాఖ ఉక్కు సాధనకు ప్రాణ త్యాగం చేసిన విషయాన్ని గుర్తు చేసుకోవాలి. అదే బాధ్యతను గుర్తు చేస్తూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించవద్దని కోరుతున్నాం'' అన్నారు. 

''వైసీపీ ఎంపీలు, టీడీపీ ఎంపీలకు మీ బాధ్యతను గుర్తుచేస్తున్నాం. వైసీపీ ఎంపీలు ముందుండి పార్లమెంటులో స్టీల్ ప్లాంట్  ప్రైవేటీకరణ అంశాన్ని అడ్డుకోవాలి. ఎన్నో త్యాగాలతో వచ్చిన పరిశ్రమ కాబట్టి పెట్టుబడుల ఉపసంహరణ వ్యవహారంలో పునరాలోచన చేయాలన్న విషయాన్ని కేంద్రానికి తెలియచెప్పాలి. ఆ కార్యక్రమాన్ని మీరు ముందుకు తీసుకువెళ్తారని ఆశిస్తున్నాం'' అన్నారు. 

''డిజిటల్ క్యాంపెయిన్ లో భాగంగా ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో మీ ఎంపీలకు మీ పోస్టులు ట్యాగ్ చేయండి. పార్లమెంటులో ప్లకార్డులు ప్రదర్శించమని వైసీపీ ఎంపీలకు తెలియచెప్పాలి. వారికి బాధ్యతను గుర్తు చేయాలి'' అని రాష్ట్ర ప్రజలకు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్