చిరంజీవితోనూ దండం పెట్టించుకున్నావ్.. దిగొచ్చావా, నీకేమైనా కొమ్ములున్నాయా: జగన్‌పై పవన్ వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Aug 20, 2022, 6:43 PM IST
Highlights

ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ముఖ్యమంత్రివి అయితే దిగొచ్చావా.. కొమ్ములుంటాయా అంటూ పవన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎంతకాలం జగన్‌కు భయపడతాం.. చిరంజీవితో కూడా జగన్ దండం పెట్టించుకున్నారని మండిపడ్డారు. 

ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. శనివారం కడప జిల్లాలో కౌలు రైతు భరోసా యాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు ఆర్ధిక సాయాన్ని అందజేశారు పవన్. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రివి అయితే దిగొచ్చావా.. కొమ్ములుంటాయా అంటూ పవన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎంతకాలం జగన్‌కు భయపడతాం.. చిరంజీవితో కూడా జగన్ దండం పెట్టించుకున్నారని మండిపడ్డారు. తన కుటుంబంలోని వ్యక్తిని కూడా జగన్ చేతులు పట్టుకునేలా చేశారని పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చేతులు కట్టుకుని తన ముందు నిలబడేలా చేశారని జనసేనాని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ ఆధిపత్య ధోరణిని చూపిస్తున్నారని.. అన్న పట్టించుకోలేదని చెల్లెలు మరో పార్టీ పెట్టారని పవన్ చురకలు వేశారు. 

ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయకుండా వుంటే ఈరోజు రాష్ట్రానికి ఈ పరిస్ధితి వచ్చేది కాదని పవన్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం వైసీపీలో మంత్రులుగా వున్నవారు.. మంత్రులుగా పనిచేసిన వారు దగ్గరుండి విలీనం చేయించారని ఆయన ఆరోపించారు. ఏపీలో వారసత్వ రాజకీయాల్లో మార్పు రావాల్సి వుందన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. కులం, మతాలపై రాజకీయాలు సరికాదన్నారు. ఏపీలో చీప్ లిక్కర్ రాజ్యమేలుతోందని.. పద్యం పుట్టిన నేలలో నేడు మద్యం ఏరులై పారుతోందని పవన్ కల్యాణ్ ఆరోపించారు. తాను ఎప్పుడూ కులమతాల గురించి ఆలోచించలేదని.. కౌలు రైతులకు సరిగా గుర్తింపు కార్డులు ఇవ్వడం లేపదని జనసేనాని ఆరోపించారు. 

Also REad:పౌరులూ యాప్ సిద్ధం చేస్తారు.. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం చేస్తున్నారో ట్రాక్ చేస్తారు.. పవన్ కల్యాణ్..

జనసేనకు ఓ ప్రధాన సామాజిక వర్గంతో సంబంధాన్ని అంటగడుతున్నారని ఆయన మండిపడ్డారు. ప్రాధాన్యం లేని కులాలకు ప్రాధాన్యం వచ్చేలా చూస్తానని పవన్ హామీ ఇచ్చారు. తాను వ్యక్తుల మీద ఫైట్ చేయనని.. వారి భావజాలం, ఆలోచనా విధానంపైనే పోరాటం చేస్తానన్నారు. రాజకీయాల్లోకి సరదా కోసం రాలేదని.. మార్పు కోసం వచ్చానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఆఫ్రికాలో తెగలు, అమెరికాలో జాతుల మాదిరే మనదేశపు సామాజిక మూల లక్షణం కులాలన్నారు. 

రాయలసీమలో 11 శాతం వున్న మాదిగలు, 8 శాతం వున్న మాలల గురించి పట్టించుకున్నారా అని పవన్ ప్రశ్నించారు. వైఎస్ వివేకాను చంపిన వారిని ఇప్పటి వరకు ఎందుకు పట్టించుకోలేదన్న ఆయన.. కోడికత్తి కేసు ఏమైందని నిలదీశారు. తాము అధికారంలోకి వస్తే వ్యవస్థలను బలోపేతం చేస్తామని.. జనసేనకు ఛాన్స్ ఇవ్వాలని పవన్ కోరారు. 
 

click me!