వారి బాధను తీర్చలేం.. ఇవాళ్టీ ప్రమాదాలపై పవన్ ఉద్వేగం

First Published Jun 24, 2018, 4:33 PM IST
Highlights

వారి బాధను తీర్చలేం.. ఇవాళ్టీ ప్రమాదాలపై పవన్ ఉద్వేగం 

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జరిగిన వరుస ప్రమాదాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా లక్ష్మీపురంలో ట్రాక్టర్ ప్రమాదంలో 16 మంది .. కర్నూలు జిల్లా ఓర్వకల్లు రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది.. ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణానదిలో నలుగురు విద్యార్థులు మృత్యువాత పడటంపై పవన్ ఉద్వేగానికి లోనయ్యారు. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుని వుంటే వారి ప్రాణాలు నిలిచేవని పవన్ అన్నారు..

బంగారు భవిష్యత్తు ఉన్న ఇంజనీరింగ్ విద్యార్థుల జీవితాలు విషాదంగా ముగియడం బాధాకరమన్నారు.. విగతజీవులుగా పడివున్న బిడ్డలను చూసి వారి తల్లిదండ్రులు ఎంతగానో రోదిస్తుంటారని.. ఏం చేసినా వారి బాధను మనం దూరం చేయలేమన్నారు.. ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని.. జరుగుతున్న సంఘటనలను చూసైనా కృష్ణానది సంగమం వద్ద మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

వాచ్ టవర్ ఏర్పాటు చేసి తగిన సంఖ్యలో పోలీసు పహారాను ఏర్పాటు చేయాలని పవన్ కల్యాణ్ ప్రభుత్వానికి సూచించారు. మృతుల కుటుంబాలకు శాంతి కలగాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని.. మృతుల కుటుంబీకులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. 
 

click me!