అంతా దుష్ప్రచారమే.. బీజేపీ అలా చేయదు: సీఏఏపై పవన్ వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Feb 12, 2020, 6:09 PM IST
Highlights

సీఏఏ బిల్లుపై కాంగ్రెస్, ఇతర పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయని పవన్ మండిపడ్డారు. సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలంటూ పవన్ బుధవారం కర్నూలులో ర్యాలీ నిర్వహించారు. 

సీఏఏ బిల్లుపై కాంగ్రెస్, ఇతర పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయని పవన్ మండిపడ్డారు. సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలంటూ పవన్ బుధవారం కర్నూలులో ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత్-పాక్ విభజన సమయంలో పాకిస్తాన్ ముస్లిం రిపబ్లిక్‌గా ప్రకటించుకుందని... కానీ భారతదేశం మాత్రం అలా చేయలేదని పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. ముస్లింలను భారతదేశం నుంచి ఎవరు దూరం చేయలేరని, ఏ మత పెద్దలు చెప్పినా దీనిని నమ్మొద్దని ఆయన స్పష్టం చేశారు.

అన్ని మత విశ్వాసాల కంటే దేశభక్తి గొప్పదని తాను దానికి కట్టుబడి పనిచేస్తానని పవన్ తెలిపారు. భారత ప్రధాని నెహ్రూ-పాక్ ప్రధాని లియాఖత్‌ల మధ్య జరిగిన ఒప్పందానికి ఆధారంగా భారత్‌లో ఉన్న ముస్లిములను తాము రక్షిస్తామని నెహ్రూ.. పాక్‌లో ఉన్న ముస్లిమేతరులను తాము కాపాడతామని లియాఖత్ చెప్పారని పవన్ గుర్తుచేశారు.

Also Read:ప్రీతికి న్యాయం చేయనప్పుడు.. కర్నూలులో జ్యూడీషియల్ క్యాపిటల్ ఎందుకు: పవన్

నెహ్రూతో పాటు తర్వాత వచ్చిన ప్రధానులు ఈ మాట నిలబెట్టుకుంటే.. పాక్ ప్రభుత్వం మాత్రం మాట తప్పిందన్నారు. ఇస్లాం మతానికి చెందిన అబ్దుల్ కలాంను భారతదేశానికి రాష్ట్రపతిగా చేసుకున్నామని.. కానీ ఒక హిందూ వికెట్ కీపర్ పట్ల పాకిస్తానీయులు వివక్ష చూపారని పవన్ తెలిపారు.  ప్రతిభ ఉన్నప్పుడు మతం చూడకుండా అబ్ధుల్ కలాం, అజారుద్దీన్‌లను గుండెల్లో పెట్టుకున్న ఘనత భారతదేశం సొంతమన్నారు.

కర్నూలులో హైకోర్టుకు జనసేన వ్యతిరేకం కాదని సమగ్ర రాయలసీమ అభివృద్ధి గురించి తాను మాట్లాడుతున్నానని పవన్ స్పష్టం చేశారు. తాను దిగువ మధ్య తరగతి స్థాయి నుంచి వచ్చానని, జగన్ రెడ్డిలాగా వేల కోట్లతో ఒక పార్టీని నడిపే స్తోమత తనకు లేదన్నారు.

Also Read:పవన్ కర్నూలు పర్యటనలో ఉద్రిక్తత: అడ్డుకున్న విద్యార్థులు, పోలీసుల మోహరింపు

జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారు రాష్ట్రానికి వచ్చింది ఏం లేదని మొత్తం పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయాయని పవన్ ఆరోపించారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత అద్భుతాలు ఏం జరగవని వైఎస్ జగన్ ప్రూవ్ చేస్తున్నారని పవన్ సెటైర్లు వేశారు.

హంద్రీనీవా పైప్‌ లైన్ వెళ్తూ కూడా కర్నూలు ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జనసేనాని ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమ నుంచి ఆరుగురు ముఖ్యమంత్రులు అయ్యారని... కానీ ఈ ప్రాంతం మాత్రం అభివృద్ది చెందడం లేదని ఆయన ప్రశ్నించారు.

రాయలసీమలో నీరు పల్లంవైపు వెళ్లవని.. బలవంతుల పోలాలు వున్నవైపు మాత్రమే వెళ్తాయని ఆయన మండిపడ్డారు. తాను ఒక జిల్లాకో ప్రాంతానికో, మతానికో, కులానికో చెందినవాడిని కాదని పవన్ గుర్తుచేశారు. 

click me!