ఎయిడెడ్ విద్యాసంస్థల విలీనం: ఆ నాలుగు ఆప్షన్ల వెనుక ఏదో మతలబు.. జగన్ సర్కార్‌పై పవన్ వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Nov 13, 2021, 08:54 PM ISTUpdated : Nov 13, 2021, 08:55 PM IST
ఎయిడెడ్ విద్యాసంస్థల విలీనం: ఆ నాలుగు ఆప్షన్ల వెనుక ఏదో మతలబు.. జగన్ సర్కార్‌పై పవన్ వ్యాఖ్యలు

సారాంశం

ఏపీలో ఎయిడెడ్ విద్యాసంస్థల విలీనం అంశంపై పవన్ కల్యాణ్ స్పందించారు. ఎయిడెడ్‌ విద్యాసంస్థల విషయంలో ప్రభుత్వం ఇచ్చిన నాలుగు జీవోలను రద్దు చేస్తేనే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చేస్తున్న ఆందోళనకు ఫలితం ఉంటుందన్నారు.   

ఏపీలో ఎయిడెడ్ విద్యాసంస్థల విలీనం అంశం తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్ధి సంఘాలు ఆందోళనలు నిర్వహిస్తుండగా.. వీరికి రాజకీయ పార్టీలు కూడా మద్ధతు ప్రకటిస్తున్నాయి. తాజాగా ఈ వ్యవహారంపై జనసేన (janasena) అధినేత, పవన్ కల్యాణ్ (pawan kalyan) స్పందించారు. ఎయిడెడ్‌ విద్యాసంస్థల విషయంలో ప్రభుత్వం ఇచ్చిన నాలుగు జీవోలను రద్దు చేస్తేనే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చేస్తున్న ఆందోళనకు ఫలితం ఉంటుందన్నారు. తమ పిల్లలు చదువుతున్న విద్యా సంస్థలను ఎప్పటిలాగే కొనసాగించాలని, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ ద్వారా ఆ విద్యాసంస్థల నిర్వహణ సాగేలా చూడాలని తల్లిదండ్రులు కోరుతున్నారని పవన్ కల్యాణ్  గుర్తుచేశారు. 

అనంతపురం, కాకినాడ, విజయవాడ, విశాఖపట్నం.. ఇలా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో విద్యార్థులు రోడ్డు మీదకు వస్తున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల కాలేజీలు, స్కూళ్లు ప్రైవేటు విధానంలోకి వెళ్తే ఫీజులు భరించలేమని విద్యార్ధులు చెబుతున్నారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆందోళనకు తలొగ్గినట్టు కనిపించిన ప్రభుత్వం మెమో ద్వారా ఎయిడెడ్‌ విద్యాసంస్థలకు ఆప్షన్లు ఇచ్చామని ప్రకటన చేసినా అందులో ఏదో మతలబు వుందని పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఆప్షన్ల పేరుతో విద్యార్థులను, తల్లిదండ్రులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు,. 

Also Read:ఎయిడెడ్ సంస్థల విలీనం : ‘తన తప్పులు తానే బయటపెట్టుకునే గొప్పతనం జగన్ రెడ్డిది’.. నారా లోకేష్ ఎద్దేవా..

నాలుగు మార్గాలు చెప్పాం... విద్యాసంస్థల నిర్వాహకులు ఏదో ఒకటి ఎంచుకుంటారని విద్యాశాఖ తన బాధ్యత నుంచి తప్పించుకోకూడదని జనసేనాని హితవు పలికారు. ఎప్పటిలాగే ఎయిడెడ్‌ విద్యాసంస్థలు కొనసాగాలంటే జీవో 42, 50, 51, 19లను పూర్తిగా రద్దు చేయాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. 1982 నాటి విద్యాహక్కు చట్టానికి విరుద్ధంగా ఉన్న ఈ జీవోలను రద్దు చేయడంతో పాటు గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కొనసాగించాలని జనసేన అధినేత విజ్ఞప్తి చేశారు. 

కాగా.. ఎయిడెడ్ సంస్థల విలీనంపై (aided institutions) ఏపీ విద్యాశాఖ (ap education department) శుక్రవారం అంతర్గత మెమో జారీ చేసింది. 2249 ఎయిడెడ్ విద్యాసంస్థల్లో 68.78 శాతం విద్యాసంస్థలు విలీనానికి అంగీకరించాయని ఏపీ విద్యాశాఖ ప్రకటించింది. 702 ఎయిడెడ్ విద్యాసంస్థలు అంగీకరించలేదని తెలిపింది. ఇదే సమయంలో తాము ఎయిడెడ్ విద్యాసంస్థలపై ఒత్తిడి పెట్టలేదని.. విలీనానికి 4 ఆప్షన్లు ఇచ్చినట్లు వెల్లడించింది. 

ఆప్షన్లు ఇవే:

ఆప్షన్ 1 : ఆస్తులు, సిబ్బందితో సహా విలీనం
ఆప్షన్ 2 : ఆస్తులు మినహా ఎయిడెడ్ సిబ్బందిని సరెండర్ చేసి ప్రైవేట్ అన్ ఎయిడెడ్‌గా కొనసాగించడం
ఆప్షన్ 3 : ప్రైవేట్ ఎయిడెడ్ సంస్థలుగా కొనసాగడం
ఆప్షన్ 4 : విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అవకాశం

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్