
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ టిడిపి అధినేత చంద్రబాబునాయుడు మనిషే అని జగన్మోహన్ రెడ్డి ముద్రేసేసారు. ‘చంద్రబాబునాయుడు సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్’ అంటూ పవన్ను ఉద్దేశించి జగన్ అన్న మాట ఇపుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై మాట్లాడిన జగన్ తర్వాత మీడియా పవన్తో కలిసి పనిచేసే విషయమై ప్రశ్నించగా పై విధంగా స్పందించారు. అంటే, జగన్ ఉద్దేశ్యంలో పవన్ మాటలకు, చేష్టలకు తెరవెనుక కథ నడిపించేది చంద్రబాబే అన్నది స్పష్టమవుతోంది.
ప్రత్యేకహోదా అంశంపై జగన్, పవన్ ఒకే డిమాండ్ వినిపిస్తున్నారు. కానీ ఇంత వరకూ కలిసి పనిచేసింది లేదు. విడివిడిగా ఉద్యమాలు చేసే బదులు ఒక్కతాటిపై నిలబడవచ్చు కదా అని పలువురు ఇద్దరికి సూచించినట్లు సమాచారం. అయితే, ఇద్దరిలో ఏ ఒక్కరు కూడా ముందుకు అడుగువేయకపోవటం గమనార్హం. అందుకు కారణాలేమిటి? అంటే, తాజాగా జగన్ చేసిన వ్యఖ్యలే అద్దం పడుతున్నాయి.
గతంలో పవన్ చర్యలు కూడా అనుమానించేందుకు ఆస్కారం కల్పించింది. ఇదే విషయంలో చాలామందిలో కూడా జగన్ కున్న అనుమానాలే ఉన్నాయ్. రాజధాని రైతుల సమస్యలు కావచ్చు, ప్రత్యేకహోదాపై కార్యాచరణ విషయం కావచ్చు, రాజధాని ప్రాంతం కేంద్రంగా జరుగుతున్న భూ కుంభకోణాల విషయంలో కూడా కావచ్చు. జల్లికట్టు స్పూర్తితో విశాఖపట్నంలోని ఆర్కె బీచ్ లో ర్యాలీ జరపాలని పిలుపిచ్చిన పవన్ ఆరోజు అసలు అడ్రస్సే లేరు. ఇలా ఏది తీసుకున్నా పవన్ లో నిలకడ లోపించటంతో పలువురు అనుమానిస్తున్నారు. అందుకే పవన్ తో కలిసి పనిచేయటానికి జగన్ సంసయిస్తున్నట్లు సమాచారం.